వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దున్నపోతుకు చొక్కా పంచెకట్టినట్టుంటే రఘురామరాజు కొమ్ముల్లేని దున్నపోతని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. పోలవరం గురించి అమిత్ షాతో సీఎం జగన్ మాట్లాడకుండా… బయటకు వచ్చి పోలవరం గురించి చర్చించామని ప్రకటించారు. అసలు అమిత్ షాతో ఏమి మాట్లాడారో బయటపెట్టాలని రఘురామకృష్ణంరాజు నిన్న ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రఘురామరాజుపై తీవ్ర పదజాలంతో పెద్దిరెడ్డి మండిపడ్డారు. రఘురామరాజు ఒక బ్లాక్ షీప్ అంటూ విరుచుకుపడ్డారు. ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేసి, గెలవాలని సవాల్ విసిరారు. వైసీపీలో ఉంటూ విపక్షంలా మారాడని, రఘురామరాజును చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నాడని పెద్దిరెడ్డి విమర్శించారు.
బీజేపీలో చేరిన కొందరు పెద్దల సూచనల మేరకే..
తనపై కేసులు ఉన్నందునే బీజేపీకి దగ్గరవుతున్నానని ఒక పెద్దిరెడ్డి సీఎంకు చెప్పారని రఘురామరాజు చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తనపై ఒక కేసు ఉంటేనే బీజేపీకి దగ్గరైతే, సీఎంపై 33 ఛార్జిషీట్లు ఉన్నాయి… అందుకే బీజేపీకి దగ్గరయ్యారా అని రఘురామరాజు నిన్న ప్రశ్నించారు.దీనిపై పెద్దిరెడ్డి రఘురామరాజుపై విరుచుకుపడ్డారు. వైసీపీ నుంచి గెలిచిన బ్లాక్ షీప్ అంటూ ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన కొందరు పెద్దల సూచనల మేరకు ఎంపీ రఘురామరాజు చెలరేగిపోతున్నాడని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా రఘురామరాజు తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.
Also Read : హిందుత్వంపై దాడి : జగన్ సర్కారుపై విమర్శల పరంపర











