పశుసంవర్ధకశాఖ మంత్రి తనసాని శ్రీనివాస్ యాదవ్, మరికొంత మంది నేతలపై పెట్టిన కేసుల్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. తలసానిపై పెట్టిన రెండు వేర్వేరు కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆయనను నిర్దోషిగా నాంపల్లి రెండవ సెషన్ కోర్టు తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సుమారు 4వేల మంది వరకు, రాష్ట్రంలో సుమాదు వంద మంది వరకు ప్రజాప్రతినిధుల పైన వివిధ కేసులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పటు చేసి త్వరతగతిన కేసుల విచారణను చేపడుతున్నారు. ఈక్రమంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన కేసు విచారణ మంగళవారం జరిగింది.
11 ఏళ్ల క్రితం కేసు…
దాదాపు 11 ఏళ్ల క్రితం తలసానిపై నమోదైన కేసుకు సంబంధించిన తీర్పును నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తలసాని శ్రీనివాస్ యాద్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదూరి చిన్న శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 2009 ఏప్రిల్ 13వ తేదీన సికింద్రాబాద్లోని అడ్డగుట్ట క్రాస్ రోడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా స్టేజీని ఏర్పాటు చేశారనే కారణంతో అప్పటి తుకారాం గేట్ పోలీసులు ఏ1గా అజయ్బాబు, ఏ5గా తలసాని శ్రీనివాస్ యాదవ్ను పేర్కొంటూ మొత్తం ఐదుగురిపై 188, 290, 143 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అలాగే 2014లో నిబంధనలకు విరుద్దంగా పాదయాత్రను నిర్వహించారని ఏ1గా రాజకీయ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, ఏ2గా తలసాని శ్రీనివాస్ యాదవ్లను పేర్కొంటూ వీరిద్దరిపై 188, 76 సిపి యాక్ట్ కింద గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు
అయితే ఈ కేసులకు సంబంధించి పూర్వాపరాలు విచారించిన నాంపల్లి 2వ సెషన్ కోర్టులో ఎమ్మెల్యే, ఎంపీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు మంగళవారం విచారించింది. విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మంత్రి తలసానితో పాటు కేసులో పేర్కొన్న వారందరిని నిర్దోషులుగా పేర్కొంటూ న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు.
హాజరైన పలువురు విఐపీలు…
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారణ చేపడుతోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కోర్టుకు హాజరవుతున్నారు. సోమవారం ఎంపీ రేవంత్రెడ్డి, మరికొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరైనారు.