కరోనా వైరస్ ఒక్కసారిగా జనాన్ని రెస్ట్ మోడ్ లోకి నెట్టేసింది. 6 నెలలుగా బైట ప్రపంచాన్ని చూడకుండా.. ఇళ్ళకే పరిమితమయిపోయారు చాలా మంది. అందులో పలువురు స్టార్ సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారనుకోండి. ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలేమీ ఇంకా షూటింగ్స్ మొదలుపెట్టని కారణంగా.. ఇళ్ళల్లోనే ఉన్న కొందరు టాప్ మోస్ట్ టాలీవుడ్ డైరెక్టర్లు .. చక్కగా రిలాక్స్ అవుతునే మరో కొత్త బిజినెస్ మీద ఫోకస్ పెట్టారట. ఆ లిస్ట్ లో రాజమౌళి, కొరటాల శివ, సుకుమార్, కొరటాల శివ, హరీశ్ శంకర్ లాంటి బడా దర్శకులున్నారు.
షూటింగ్స్ తిరిగి ప్రారంభించడానికి వీరికి ఇంకా టైమ్ ఉండడంతో ఇప్పుడీ దర్శకులు .. కొన్ని ప్రాజెక్టులకు స్క్రిప్టు సమకూర్చే పనిలో పడ్డారట. ఆ స్క్రిప్టు రాసేది వాళ్ళు తెరకెక్కించబోయే సినిమాల కోసమే అనుకుంటున్నారా? కాదండీ.. వేరే వారి సినిమాల కోసం. ప్రస్తుతం ఈ బిజినెస్ .. ఆ బడా దర్శకులకు బాగానే కాసులు కురిపిస్తోందని తెలుస్తోంది. అందులో కొందరు సింపుల్ గా చేస్తున్న ఒక పనేంటంటే.. వేరే ప్రాజెక్టులకు సహనిర్మాతలుగా వ్యవహరించడం అన్నమాట.
అందులో సుకుమార్ ముందు వరుసలో ఉన్నాడు. సుక్కూ ప్రస్తుతం ‘ఉప్పెన, 18 పేజెస్’ లాంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు కూడా సహనిర్మాతగా మారబోతున్నాడు. హరీశ్ శంకర్ విషయానికొస్తే.. ఇటీవలే పవర్ స్టార్ తో ఒక సినిమాను ప్రకటించి అభిమానుల్ని అలరించాడు . దాంతో పాటు సునీల్ ప్రధాన పాత్రలో ఇటీవలే అనౌన్స్ అయిన ‘వేదాంతం రాఘవయ్య’ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే కూడా అందిస్తున్నాడు . దానికోసం అతడు డిజైన్ చేసిన టైటిల్ రోల్ కేరక్టరైజేషన్ సునీల్ కు భలేగా నచ్చేసిందట. అలాంటి పాత్రకోసం ఎప్పటినుంచో చూస్తున్నాడట.
ఇక ఇదే తరహాలో ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్ , హలో గురూ ప్రేమకోసమే’ లాంటి హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన .. త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ బ్రహ్మాండమైన కథ అందించాడట. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి ప్రకటన అతి త్వరలోనే రానుందట. అలాగే.. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రైట్స్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వెర్షన్ కి కేస్టింగ్ ఇంకా సెట్ అవలేదు కానీ.. దీని స్క్రిప్టు మాత్రం త్రివిక్రమ్ అందిస్తున్నాడట. ఇద్దరు పెద్ద మనుషుల ఇగో క్లాషెస్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను గురూజీ తన స్టైల్ లోకి మార్చేస్తున్నాడట. ఇక మరో క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఇప్పుడు అదే తరహాలో.. కొందరు నిర్మాతలకు స్క్రిప్టు విషయంలో సలహాలిస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నాడట. ఇంకా వంశీపైడిపల్లి, నందినిరెడ్డి, దేవాకట్టా, శివనిర్వాణ దర్శకులు కూడా అదే రూట్లో వెళుతున్నారట. ఏదేమైనా స్టార్ డైరెక్టర్ల బిజినెస్ అదుర్స్ కదూ..