కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 9వ తేదీన పోలీంగ్ జరగనుంది. 12వ తేదీన ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయిని ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి సారి ఎన్నికల సంఘం విడుదల చేసిన దానిప్రకారం ఏప్రిల్ 7వ తేదీన పోలీంగ్ జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా 5 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఈమె గెలుపు లాఛనమే. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థిగా అప్పట్లో గెలుపొందారు. అయితే ఈయన 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరటంతో మండలి ఛైర్మన్ స్వామీగౌడ్ అతనిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అనర్హత వేటుతో ఉపఎన్నిక..
లాక్డౌన్ కారణంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. చివరికి అక్టోబర్ 12న ఎన్నిక ఫిక్స్ అయింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి కారణంగా నిజామాబాద్ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. అప్పటికే ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2015, డిసెంబర్ 12న టీఆర్ఎస్ నుంచి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఫిరాయించడంతో ఆయనపై 2019లో తెలంగాణ శాసన మండలి వేటు వేసింది. తర్వాత భూపతిరెడ్డి కోర్టులను ఆశ్రయించడంతో ఆయనకు ప్రతికూల తీర్పు వచ్చింది. దీంతో మళ్లీ ఎన్నికకు మార్చి 5న నోటిఫికేషన్ ఈసీ జారీ చేసింది. ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహణ ఉంటుందని ప్రకటించింది. అయితే కరోనాతో ఉప ఎన్నిక వాయిదా పడింది.
గెలుపు లాంఛనమే..
నిజామాబాద్ జిల్లాలో ఎంపిటిసి, జడ్పిటిసీ, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో కవిత విజయం ఇక దాదాపు ఖరారైనట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. కాంగ్రస్, బిజెపి పార్టీలకు అక్కడ మెజార్టీ లేనందున ఆ రెండు పార్టీలు అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం లేదని సమాచారం.