‘బాహుబలి’ సిరీస్ తో భారతీయ సినిమా గర్వంగా తలెత్తుకొనేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆయన పేరు మారుమోగిపోయింది. ఒక సినిమాను కమర్షియల్ గా తెరకెక్కించడమే కాకుండా.. దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అనే అంశంలో ఆయన మాస్టర్. అందుకే దర్శకుడిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకూ అపజయమే ఎరుగలేదు. ముందు నుంచీ సౌత్ సినిమాను తక్కువగా చూడడం బాలీవుడ్ నైజం.
కానీ ‘బాహుబలి’ సినిమా వారి చిన్నచూపు తనానికి చెంపపెట్టుగా మారింది. బాలీవుడ్ దర్శకుడికి సైతం సాధ్యం కాని కలెక్షన్స్ రికార్డును రాజమౌళి నెలకొల్పి… సౌత్ దెబ్బ రుచిచూపించాడు. పులినిచూసి నక్కవాత పెట్టుకొన్న చందంగా.. చాలా మంది నార్త్ అండ్ సౌత్ దర్శకులు ‘బాహుబలి’ లాంటి సినిమా తీయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నించి దెబ్బతిన్నారు. నిజానికి సౌత్ ఇండస్ట్రీకి విజువల్ వండర్స్ ను పరిచయంచేసిన దర్శకుడు శంకర్. జీన్స్ , రోబో లాంటి సినిమాతో తన స్టామినా చూపించాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొనే రాజమౌళి ..మగధీర, ఈగ సినిమాతో ప్రేక్షకులకు విజువల్ వండర్స్ అందించాడు.
ఆ తర్వాత ‘బాహుబలి’తో అద్భుతాలు సృష్టించాడు. అయితే శంకర్ లాంటి దర్శకుడు కూడా 2.0 లాంటి భారీ గ్రాఫిక్స్ సినిమా చేసినా.. రాజమౌళి స్థాయినిమాత్రం మ్యాచ్ చేయ లేకపోయాడన్నది వాస్తవం. ‘బాహుబలి’ సినిమాని ప్రేరణగా తీసుకొని పాన్ ఇండియా కేటగిరిలో ‘కేజీఎఫ్’ రూపొందించి.. అన్ని భాషల్లోనూ విడుదల చేసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు రెండో పార్ట్ చిత్రీకరణలో పూర్తి బిజీగా ఉన్నాడు. అయితే శంకర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ కూడా విజువల్ వండర్స్ క్రియేట్ చేసినా .. రాజమౌళి స్థాయిలో పురాణ గాథల్ని కానీ, జానపద జోనర్ ను కానీ అటెమ్ట్ చేయలేదు.
నెంబరాఫ్ గ్రాఫికల్ షాట్స్ అవసరమయ్యేది ఆ జోనర్ లోనే. పెర్షెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ గ్రాఫిక్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాత్రల డిజైనింగ్ , వాళ్ళ కాస్ట్యూమ్స్ డిజైనింగ్.. జానపద వాతావరణం, అందుకు తగ్గ ప్రాపర్టీస్.. ఇవన్నీ సమకూర్చుకోవడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. అందుకే వారిద్దరికన్నా రాజమౌళి జోనర్ కి మరింత పేరొచ్చింది . ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజమౌళికి ప్రత్యామ్నాయంగా మరో దర్శకుడు వస్తున్నాడు. ఆయన పేరు ఓం రౌత్. బాలీవుడ్ లో లోకమాన్య : ఏక్ యుగ పురుష్, తానాజీ లాంటి చారిత్రక చిత్రాలతో సత్తా చాటుకున్నాడు.
ముఖ్యంగా అజయ్ దేవ్ గన్ నటించిన తానాజీ సినిమా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించింది. సినిమా రంగంలో వివిధ శాఖలపై ఎంతో పట్టు సాధించిన ఈ దర్శకుడు .. తాజాగా ప్రభాస్ హీరోగా ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ పౌరాణిక గాథ తెరకెక్కనుంది. సినిమా పేరు ‘ఆదిపురుష్’. రామాయణంలోని ఒక ఘట్టాన్ని ఇతివృత్తంగా చేసుకొని ఈ సినిమా రూపొందనుంది. ప్రభాస్ రాముడిగానూ, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రావణుడిగానూ నటించబోతున్నారు.
కాగా ఈ సినిమాపై ప్రస్తుతం ఓరేంజ్ లో క్రేజ్ నెలకొంది. అంచనాలు కూడా అంబరాన్నంటుతున్నాయి. ప్రభాస్ కెరీర్ లోనే ఇది మైలురాయి లాంటి సినిమా అవుతుందని భావిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. గ్రాఫికల్ వండర్ గా తానాజీని మలిచిన ఓం రౌత్.. ఆదిపురుష్ చిత్రాన్ని ఏ రేంజ్ లో రూపొందిస్తాడో ? రాజమౌళి ఇంటెలిజెన్స్ ను ఏ విధంగా మ్యాచ్ చేస్తాడో చూడాలి.