ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ నడుస్తోంది. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం రావాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో జనసేన కూడా ఈ ఎన్నిక విషయంలో తమ అభ్యర్థిని నిలపాలనే పట్టుదలతో ఉంది. ఈ రెండు పార్టీలకు మిత్రత్వం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తారని గతంలోనూ ఆ పార్టీ నేతలు చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా.. జనసేన పార్టీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలుపుకొని వెళ్లడం లేదన్న సందేహాలు కొన్నాళ్లుగా వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలోనూ రెండు పార్టీలూ కలసి పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. తాము సమన్వయం కోసం ముందుకు వస్తున్నా.. బీజేపీ నేతలు సిద్ధంగా లేరని జనసేన నాయకులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అలాంటి సంకేతాలే ఇచ్చారు. కేంద్రనాయకత్వం తమపట్ల సానుకూలంగానే వ్యవహరిస్తున్నా.. రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కనిపించడం లేదని చెప్పారు. రెండు పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విజయం దక్కుతుందని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. కాగా పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.
సమస్య పాతదే.. వ్యాఖ్యలే కొత్తవి..
జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడిన కొన్నాళ్లవరకు పరిస్థితి బాగానే కనిపించినా తరవాత ఆ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు జనసేన తన అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్న రెండుమూడు రోజులకే పవన్ ఢిల్లీ వెళ్లారు. అప్పట్లో ఆయనకు అపాయింట్మెంట్ ఆలస్యమైందని ప్రచారం జరిగింది. తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా పలువురితో పవన్ భేటీ అయ్యారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని రెండు పార్టీలూ ప్రకటించాయి. తరువాతి కాలంలో పవన్ కల్యాణ్ అమరావతి దీక్షకు సంఘీభావం తెలిపారు. బీజేపీ కూడా రాజధానిగా అమరావతికే తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అయితే రెండు పార్టీలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపట్టాయి. పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో చేసిన పర్యటన, రైతుల కోసం చేపట్టిన యాత్రకూ బీజేపీ పెద్దగా సపోర్టు అందించలేదు. అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో తామే అభ్యర్థిని నిలుపుతామని, జనసేన సహకరిస్తుందని ఆ పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానించారు.
ఇక దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఇష్యూల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ చేసిన కౌంటర్ కామెంట్లకు జనసేన ఒక్కటే స్పందించాల్సి వచ్చింది. బీజేపీ నోరు మెదపలేదు. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే తాము స్పందిస్తున్నామని, పవన్ ని విమర్శించినప్పుడు రాష్ట్ర బీజేపీ కనీసం స్పందించడం లేదని జనసేన నాయకులు గతంలోనే వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీకి చెందిన కొందరు నాయకులు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని విమర్శించడం మానేసి.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం రానున్న కాలంలో పార్టీకి నష్టం చేస్తుందని, అలాంటప్పుడు బీజేపీతో కలసి ఉండడం వల్ల తమకు కూడా నష్టం వస్తుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ జనసేన నాయకులు ఈ విషయంపై పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. తమను చిన్నచూపు చూసే విధంగా మాట్లాడుతున్నారని, అసలు రాష్ట్రంలో బీజేపీకి నాయకులు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ ఉన్నారని, వారికి అంత ప్రయార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారట. దీనిపై పవన్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీతో జనసేనకు మంచి సంబంధాలే ఉన్నాయని, రాష్ట్రంలోని నాయకులే కొందరు ఇలా చేస్తున్నారని, అవసరమైతే మరోసారి ఢిల్లీకి వెళ్లి తేల్చుకొస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉమ్మడిగా పోటీచేద్దామని ప్రకటించాక కనీస సమాచారం కూడా లేకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతిలో మకాం వేసి కార్యకలాపాలను సాగించడం, తమకు ఆహ్వానం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే.. జనసేనకు వచ్చిన ఓట్లు చాలా రెట్లు ఎక్కువని, ఏం జరుగుతుందో చూద్దామని, మనవైపునుంచి కూటమినుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు లేవని, వారినుంచే ఆ రకమైన పనులు మొదలయ్యాయని జనసేన ముఖ్య నాయకులు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో తేల్చేస్తామని, కూటమి అన్నప్పుడు అంతా కలసి వస్తేనే లక్ష్యం సాధ్యం అవుతుందని పవన్ వ్యాఖ్యానించడం ఈ నేపథ్యంలో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.
బండి వ్యాఖ్యలపైనా..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఏపీలో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో భాగంగా బైబిల్ కావాలో.. భగవద్గీత కావాలో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ లను విడగొట్టలేదని, ఎవరి విశ్వాసం వారిదని, ఏదైనా దేవుడి వాక్కే అన్నారు. అయితే ఒక మతం మరో మతాన్ని గౌరవించాలని, ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ స్పందన గర్హనీయమన్నారు. ఇతర వర్గాలకు సంబంధించిన వాటిపై దాడులు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడి ఉంటారో తనకు తెలియదన్నారు. మతాన్ని కేవలం బీజేపీకి మాత్రమే ఆపాదించవద్దని, అలా ఆలోచిస్తే.. వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. మొత్తంమీద జనసేన, బీజేపీలు కలసి పోటీ చేస్తాయా..కలసి పోటీ చేస్తే పరస్పర సహకారం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.











