బిల్లులు చేసేదేలే.. అంటూ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల నిరసన!
ఏపి ప్రభుత్వానికి పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు భారీ షాకిచ్చారు. పీఆర్సీ సాధన ఉద్యమంలో భాగంగా వేతన, ఇతర ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేసేదేలే అంటూ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం జగన్ రెడ్డికి ఝలకిచ్చారు. తాము కూడా ఉద్యమంలో పాల్గొంటున్నామని ట్రెజరీ డైరెక్టర్ కి ఉద్యోగులు లేఖ రాశారు. కొత్త పీఆర్సీకి సంబంధించిన వేతన బిల్లులు, ఇతర బిల్లులను ప్రాసెస్ చేయాలని ఒత్తిడి వస్తోందని, వాటిని ప్రాసెస్ చేసేది లేదని లేఖలో తేల్చి చెప్పారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని ఆ శాఖ ఉద్యోగ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే నిన్న ట్రెజరీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం నేతలు కొత్త వేతనాలను ప్రాసెస్ చెయ్యమని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వం 11వ పీఆర్సీపై ఇచ్చిన చీకటి జోవోలను తక్షణమే ఉపసంహరిచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షుడు శోభన్ డిమాండ్ చేశారు. ఒకపక్క రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాటపట్టిన వేళ, చీకటి జీవోలకు అమలు కొరకు ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రెజరీ ఉద్యోగుల కూడా ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘంలో భాగస్వాములేనని, చీకటి జీవోలను రద్దు చేసే వరకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ప్రాసెస్ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అధికారులు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు న్యాయ ఉద్యోగుల సంఘం సైతం జేఏసీకి మద్దతు ప్రకటించింది!