ఎప్పుడు ఏ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు అనేది గురువు ఏ రాశికి లోకి ప్రవేశిస్తుంది అనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. నవంబర్ 20న గురువు మకరరాశి లోకి ప్రవేశిస్తున్నందున ‘తుంగభద్ర’ పుష్కరాలు జరపడానికి రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ కొవిడ్ దాటికి ప్రపంచమంతా చిగురుటాకులా వణుకుతున్న ఈ సమయంలో ప్రజలు ఏమీ పట్టనట్టు పుష్కరాలలో పాల్గొనడానికి సిద్ధమవ్వడం ఎంతవరకు సమంజసం? ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పుష్కారాలకు హాజరు కావడం ముఖ్యమా?
ఏర్పాట్లు పూర్తి
12 సంవత్సరాల తర్వాత వస్తున్న వేడుక. దీనికి ఘనంగా ఏర్పాట్లు చేసి సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా నేపథ్యంలో అవే ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఏర్పాట్లతో పాటు… నియమాలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. పుష్కర స్నానం చేయాలని అందరికీ అభిలాష ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని వయసుల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటివి చేయాలి.
ముఖ్యమంత్రి హాజరవుతున్నారు
సిఎం జగన్ తుంగభద్ర పుష్కరాలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కర ఘాట్ చేరుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించి లాంచనంగా పుష్కరాలని మొదలుపెట్టనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ టికెట్ బుకింగ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటి ద్వారా టికెట్ తీసుకున్న వారు నేరుగా ఘాట్ ని చేరుకుని సంప్రదాయ పూజలు, పిండ ప్రదానాల వంటివి ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పనులను పూర్తి చేయడంతో పాటు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షిస్తారని ప్రభుత్వాధికారులు తెలియజేశారు.
ప్రాణాలు ముఖ్యం
12 సంవత్సరాలకి ఒక్కసారి వస్తున్న పుష్కరాలు. మళ్లీ చూడగలమో లేదో? కాబట్టి హాజరు కావాలి. ఇలా మనలో చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా వయసుపైబడిన వారు మళ్లీ 12 సంవత్సరాలు ఎదురు చూడలంటే మాటలా, అప్పటి పరిస్థితులు ఏంటో అంటూ పుష్కరాలకు వెళ్లాలని అత్రుత పడతారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనించి ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా సోకితే కేవలం ఒక్కరితో అది వదిలిపెట్టదు. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి.
అప్రమత్తత అవసరం
చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు, వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారు ఈ పుష్కరాలకు దూరంగా ఉండడం మంచిది. అంతేకాదు, హాజరు కావాలి అనుకున్న వారు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ను ధరించడం వంటి నియమాలు తప్పక పాటించడం మరచిపోకూడదు. శానిటైజర్, ఒకటికి మించి మాస్క్ లను మనతో ఉంచుకోవడం మంచిది. పుష్కరాలవడం వల్ల జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తత పాటిస్తూ… ఆరోగ్యాన్ని కాపాడుకోండి.