తన రాజకీయ ఆరంగేట్రం పై పీకే ఓ నిర్ణాయనికి వచ్చాడు. ఇప్పటికే ఆయన కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన భవిష్యత్ కార్యాచరణ పై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని ప్రకటించిన ఆయన ఆ దిశగా తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా పిలవబడే ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే తన రాజకీయ ఆరంగేట్రం పై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ లో చెరబోవడం లేదన్న ఆయన ప్రకటన తర్వాత, పీకే సొంతంగా పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన పీకే వ్యవహారానికి ఆయన ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చిందనే చర్చ జోరందుకుంది.
కాంగ్రెస్ లో చేరిక విఫలం కావడంతో ప్రశాంత్ కిషోర్ సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే టాక్ రాజకీయ వర్గాలలో నెలకొంది. ఆయన వ్యవహార శైలి కూడా అది నిజమే అనిపించింది. ఈ క్రమంలోనే పీకే కొత్త పార్టీ పై అనేక ఊహాగానులు కూడా చక్కర్లు కొట్టాయి. పీకే, కెసిఆర్ కలయిక లో జాతీయ స్థాయిలో పార్టీ రబోతోందని, దానికి సంబంధించి తమతో కలిసి వచ్చే పార్టీలతో పీకే ఇప్పటికే చర్చలు జరిపారని అనేక వార్తలు వినిపించాయి. ఇక పీకే కాంగ్రెస్ లో చెరకపోవడానికి కెసిఆర్ తో జరిగిన చర్చలు ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఈ అంశం పై తాజాగా పీకే క్లారిటీ ఇచ్చేశారు.తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ఆయన ప్రకటించాడు.కాకపోతే రాజకీయం దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించేలా ఇప్పటికే ఆయన ఒక మార్గాన్ని నిర్మించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బీహార్ వ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల మేరా పాదయాత్ర చేయాలనే నిర్ణయానికి పీకే వచ్చారట. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేయాలనే నిర్ణయించుకున్న ఆయన, రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుంటున్నారట. తాను ‘‘జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలని భావిస్తున్నానని.. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలనే’’ టార్గెట్ పెట్టుకున్నారట పీకే.
ఇదిలా ఉంటే పొత్తులపై కూడా పీకే ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.బీహార్ లో ఇప్పట్లో ఎటూ ఎన్నికలు లేవు కాబట్టి, ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతోనూ పీకే పొత్తు పెట్టుకోకూడదనే ఆలోచనలో పీకే ఉన్నారని సమాచారం.అయితే భవిష్యత్తులో పీకే తన పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదనే చర్చ తెరపీకి వస్తోంది.
మరోవైపు, ఏ రాజకీయ పార్టీని లేదా రాజకీయ వేదికను నేను ప్రకటించడం లేదని.. కేవలం బీహార్ ను మార్చాలనుకునే అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నానని పీకే వ్యాఖ్యల వెనక ఆంతర్యం వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర్జేడీ, జేడీ యూ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నా పీకేకి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోనూ విబేధాలు ఏర్పడ్డాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారి వారి వ్యతిరేక వర్గాలను ఒక్కటి చేసి ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనేదే పీకే వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తం మీద కింగ్ అవ్వడం కంటే కింగ్ మేకర్ గానే మంచి గుర్తింపు ఉంటుందని మొన్నటి వరకు భావించిన పీకే ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది.మరి పీకే వ్యూహాలు ఫలిస్తాయా తెలియాలంటే వేచి చూడాల్సిందే.