నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తనకు ఏదీ అనిపిస్తే అది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకున్న ఆయన జగన్ సర్కార్ పై ప్రశంసల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భేష్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ అడుగు ముందుకేసి సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి కరోనా సమయంలో ఆపద్బాంధవుడిగా అవతరించిన సోనూ సూద్ కంటే బెటరని వ్యాఖ్యానించారు. తాను వైఎస్ జగన్ స్వస్థలమైన పులివెందులకు వెళ్లి అక్కడే 15 రోజులు ఉండి అన్నీ విషయాలు తెలుసుకున్నానని ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేస్తున్నారు.
పులివెందులలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కాలనీలు కట్టించిన ఘనత వైఎస్ కుటుంబానిది అంటూ పోసాని వెల్లడించారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా కంటి చికిత్సలు చేయించారని వెల్లడించారు. మానసిక బాధితులకు, వికలాంగులకు భారతి ఓ స్పెషల్ కేర్ సెంటర్ నడుపుతున్నారని పోసాని పేర్కొన్నారు. ఇంత చేసినా ఏనాడూ బయటికీ చెప్పుకొని గొప్పతనం వారిది. ఈ విషయంలో సోనూ సూద్ కంటే భారతి లక్ష రెట్లు బెటరని అన్నారు. సోనూ సూద్ స్థాయిలో తెలుగు హీరోలు ఎందుకు ముందుకు రాలేదనే ప్రశ్నకు జవాబిచ్చిన పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూ సూద్ సాయం చేస్తే దేశం మొత్తం బాగుపడిందా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
సోనూ సూద్ కంటే సేవలు అందించిన వారు టాలీవుడ్ లో ఉన్నారని పోసాని అభిప్రాయపడ్డారు. కానీ వారు సోనూ సూద్ లా మీడియాలో కనబడరని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. టాలీవుడ్ హీరోలు ప్రజలకు విపత్కర సమయాలు ఎదురైనప్పుడు చాలా సార్లు సాయం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. కోట్లాది సాయం చేస్తున్నా మన హీరోలు బిల్డప్ ఇచ్చుకోరని పోసాని తెలిపారు. రూపాయి ఇచ్చి బిల్డప్ ఇచ్చుకునే వారు ఉంటారని సైటర్లు వేశారు. తాను ఈ వ్యాఖ్యలు సోనూ సూద్ ను ఉద్దేశించి చేయడం లేదంటూనే పోసాని నిప్పులు చెరిగారు. తాను కూడా సాయం చేశానని కానీ ఎప్పుడూ ఆ విషయాన్ని బయటికి చెప్పుకొనని పోసాని స్పష్టం చేశారు. సోనూ సూద్ కంటే విశాల హృదయం ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలు మనకు ఉన్నారని కానీ సోనూ సూద్ కు ఎక్కువ ప్రచారం దక్కిందని పోసాని వెల్లడించారు. పోసాని చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. సాయం చేయకుండా చేసిన వారిపై విమర్శలు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.










