ప్రధాని మోదీతో మే 17న జరిగిన భేటీ గురించి లోకేష్ ఫస్ట్ టైం స్పందించారు. మోదీతో జరిగిన సమావేశాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ అభివర్ణించారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితసారం గురించి మోదీ తనకు వివరించారన్నారు లోకేష్. తాను ఎంతోమంది రాజకీయ నాయకులను చూశానని, మోదీలో అహం అస్సలు లేదన్నారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా తయారు కావాలని మోదీ చెప్పారన్నారు.
తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 95% పూర్తిచేశామన్నారు లోకేష్. జులై 5కల్లా సమస్యలన్నీ పరిష్కరించి 100% పూర్తిచేస్తామన్నారు. పక్షపాతం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ రాష్ట్రప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని..సూపర్సిక్స్ పథకాలను దశలవారీగా అమలుచేస్తామన్నారు. మద్యం వ్యవహారంలో తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్న జగన్..అందులో తాను ఒక్కపైసా తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. వివేకా హత్యలో మాకు, మా కుటుంబానికి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తా, మీరూ రావాలని అలిపిరిలో సవాలు చేస్తే జగన్ రాలేదన్నారు లోకేష్. ఇప్పుడూ మద్యం విషయంలో సవాలు విసురుతున్నానన్నారు.
జులై చివరిలోపు విశాఖపట్నంలో టీసీఎస్ ప్రారంభమవుతుందన్నారు లోకేష్. అదే రోజు వారికి ఇచ్చిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏపీలో అభివృద్ధి పనుల పట్ల కేంద్రమంత్రులు సానుకూలంగా ఉన్నారని…రాష్ట్రం పట్టాలెక్కడానికి ఐదేళ్లు పడుతుందనుకున్నాం, కానీ ఏడాదిలోనే ఎలా ట్రాక్లోకి రాగలిగారు? ఇంత పని ఎలా చేస్తున్నారని అడిగారన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను మళ్లీ ఢిల్లీ రమ్మన్నారని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ చట్టం, సీనియారిటీ జాబితా తయారీ, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, తరగతికో ఉపాధ్యాయుడి విధానం, టెక్నాలజీ వినియోగం, లీప్ యాప్ల గురించి తెలుసుకోవడానికి రెండురోజుల సమయం ఇస్తానన్నారని లోకేష్ చెప్పారు.
కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్న భావనతో తాను ఏకీభవించనన్నారు లోకేష్. కార్యకర్తల్లో సీనియర్లు నామినేటెడ్ పోస్టులు కోరుకుంటారని, అవి జులైలోపు భర్తీ చేస్తామన చెప్పారు. అక్కడి నుంచి రెండేళ్లకోసారి మార్పులు చేస్తూ పోతామన్నారు. రూ.2వేల కోట్ల ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. కార్యకర్తలపై తప్పుడు కేసులను తీసేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు లోకేష్. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై నివేదికలు సిద్ధమయ్యాయి. జులై నుంచి ఎమ్మెల్యేలకు అవి అందించి..పద్ధతి మార్చుకోవడానికి సమయం ఇస్తామన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించినవారిపై చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నామన్నారు లోకేష్. సాక్ష్యాధారాల ప్రకారమే ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదన్నారు. చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తూనే చట్టవ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకొనే బాధ్యత అప్పగించారని..దానికి అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు లోకేష్.











