‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మమేశ్వరా ఉగ్రరూపస్య ’ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వెంకటేశ్ మహా. గ్రామీణ జీవనవిధానాన్ని తనదైన శైలిలో తెరమీద ఆవిష్కరించే ఈ దర్శకుడు ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. సినిమా పేరు మర్మాణువు. యాంగ్రీమేన్ రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు మేకర్స్.
మహా రాజా కలయికలో రాబోతున్న మాంత్రిక రహస్యాలు అంటూ.. వినూత్నంగా ప్రకటించారు. మెజీషియన్ క్యాప్ అలంకరించిన ఒక పుర్రె బొమ్మను అనౌన్స్ మెంట్ లుక్ గా రివీల్ చేశారు. రాజశేఖర్ కూతుళ్ళు శివానీ, శివాత్మిక లు ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నారు.
దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25 – గురువారం) పుట్టినరోజు సందర్భంగా… గురువారం సినిమా ప్రకటించడంతో పాటు చిత్రానికి ‘మర్మాణువు’ టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు. “వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం” అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు.