అమరావతిలో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు సేకరించారంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుల విషయమై టీడీపీ క్షేత్రసాయిలో వివరాలు సేకరిస్తుండగా అవేమి దళితులు చేసిన ఫిర్యాదులు కావని వెల్లడవుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఐడీలు కలిసి పెట్టిన పేక్ కేసులని నిర్ధారణకు వచ్చిన టీడీపీ విషయాన్ని హై కోర్టులోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రోజుకో ఆధారం వెల్లడి..
సీఐడీ చంద్రబాబుపై ఫేక్ కేసులు పెట్టిందంటూ కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ రోజుకో ఆధారం బయట పెడుతోంది. పెద్ద ఎత్తున నష్టపోయిన ఎస్సీలు తనకు ఫిర్యాదు చేయగా తాను సీఐడికి ఫిర్యాదు చేసినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారే కాదని రెండు రోజుల క్రితం టీడీపీ ప్రకటించింది. ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ కాపీ తీసుకుని అందులో ఉన్న రైతుల వివరాలను పరిశీలిస్తున్న టీడీపీ ఆయా రైతుల వీడియో సాక్ష్యాలను కూడా రెడీ చేస్తోంది. వాటిన్నింటిని ప్రణాళిక ప్రకారం బహిర్గతం చేస్తోంది.
ఐదుగురు రైతుల వివరాల సేకరణ
రాజధాని భూములను బలవంతంగా తీసుకోవడం వల్ల.. లేక ఇతర కారణాల వల్ల నష్టపోయామని పేర్కొన్న ఐదుగురు రైతుల వివరాలను టీడీపీ సేకరించింది. వారిలో రెండు కుటుంబాలు అసలు ఎస్సీలు కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు కుటుంబాలవారు తాము అసలు ఫిర్యాదు చేయలేదని… తమ భూమి అమ్ముకున్నామో లేదో వివరాలు తెలుసుకోవడానికి వచ్చి సంతకాలు పెట్టించుకున్నారని, రాజకీయాలకు తమకు సంబంధం లేదని అంటున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లోనూ అదే చెప్పామని తెలిపారు. ఈ వీడియోలన్నిటని టీడీపీ బహిరంగ పరిచింది.
ధూళిపాళ్ల విడుదల చేసిన వీడియోలో..
సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని అనే మహిళా రైతు తాము అసలు ఫిర్యాదు చేయలేదన్నారు. విచారణ పేరుతో తమ వద్దకు వచ్చిన కొందరు భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. భూమి అమ్ముకున్నామని నిర్ధారిస్తూ సంతకం చేశామని, తాము పెట్టిన సంతకాన్ని పోలీసులు కేసుగా నమోదు చేశారన్నారు. ఆ విషయం మీడియాలో వచ్చే వరకు కేసుగా తమ సంతకాల్ని చిత్రీకరించారని తెలియదన్నారు. తాము అసలు ఎస్సీలు కాదలని, ఓసీలమని, కేసు కోసం అంటే అసలు సంతకాలే పెట్టేవాళ్ళం కాదని అన్నారు.
సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న మరో రైతు అద్దెపల్లి సాంబశివరావు తమ దగ్గరకు సీఐడీ వచ్చిపొలం అమ్మారా అని అడిగితే అమ్మామని చెప్పామన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని అడిగితే అదేమీ లేదని తెలిపామన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా జరిగిందే చెప్పామని అన్నారు.
చంద్రబాబును టార్గెట్ చేశారనే..
దీంతో చంద్రబాబు టార్గెట్గా సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి కుట్ర పన్నారన్న స్పష్టమైన ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వీటిని ఇలా ప్రజల ముందు పెట్టడమే కాకుండా సీఐడీపై ఎదురు కేసులు వేయాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాజకీయ కుట్రలను పోలీసు అధికారులు అమలు చేస్తుండటం, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఓ సలహాదారుడు రాజకీయానికి వాడుకుంటున్న వైనం బయటకు రావాలంటే సీఐడీని కోర్టుకు లాగాల్సిందేనన్న పట్టుదలతో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చంద్రబాబును ఇరికించాలని అనుకున్న సీఐడీ వారే ఇరుక్కునే అవకాశాలున్నాయన్న చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు సీఐడీ కూడ రాజధాని ప్రాంతంలోని మిగతా గ్రామాల్లో విచారణ ముమ్మరం చేసింది.