మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా బి. మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. సింగల్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంది.
అయితే రవితేజ సినిమా ఎలా వచ్చిందో అని తెలుసుకోవడం కోసం రషెస్ చూసుకున్నారట. సినిమా అంతా బాగానే వచ్చినా కొన్ని కొన్ని సన్నివేశాలు సంతృప్తికరంగా అనిపించలేదట. వెంటనే కొన్ని సన్నివేశాలకు సంబంధించి రీషూట్ చేయాలని దర్శకుడికి సూచించారట రవితేజ. ఆయన సూచనలకు తగ్గట్టుగా దర్శకుడు గోపీచంద్ రీషూట్ మొదలుపెట్టాడని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా రీషూట్ ఒంగోలులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని సమాచారం. కొంతకాలంగా.. రవితేజ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ముఖ్యంగా రవితేజ ఎంతో నమ్మి, ఇష్టపడి చేసిన ‘డిస్కో రాజా’ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక రవితేజ ఆశలన్నీ ‘క్రాక్’ సినిమాపైనే పెట్టుకున్నాడు. దీంతో.. మంచి విజయం సాధించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని రవితేజ భావిస్తున్నాడు. అందుకనే ఈ సినిమా విషయంలో ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా చూసుకుంటున్నాడు రవితేజ.
ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించనుండగా సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తమన్ సింగీతం అందిస్తున్నాడు. రవితేజ, దర్శకుడు మలినేని కాంబినేషన్ లో వచ్చిన ‘డాన్ శ్రీను’, ‘బలుపు’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కలయికలోని మూడో సినిమా ‘క్రాక్’ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.