సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా ‘సుబ్బు’ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టైటిల్ వినగానే ఇది సరదాగా సాగిపోయే వినోదభరితమైన సినిమా అనే విషయం అర్థమవుతోంది. నభా నటేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ‘క్రిస్మస్’ కానుకగా ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలనే విషయాన్ని బలంగా చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, సాయిధరమ్ తేజ్ ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు.
తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. ” ఈ కథ చాలా ఆసక్తికరంగా .. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడు సుబ్బు .. నా పాత్రను .. నభా నటేశ్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశాడు. నభా చాలా బాగా చేసింది .. ఆమె పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. తమన్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం .. గతంలో నా సినిమాలకి ఆయన మంచి సంగీతం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి కూడా ఆయన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాలుగు పాటలు కూడా వేటికవే అన్నట్టుగా నచ్చుతాయి.
‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగు ఇంకా ఓ పదిరోజుల పాటు చేస్తే పూర్తవుతుందనగా లాక్ డౌన్ వచ్చింది. అరే .. షూటింగు పార్టు పూర్తయిపోయి ఉంటే బాగుండునే అనుకున్నాము. ఇటీవల అనుమతులు రాగానే చకచకా ఆ వర్క్ ను పూర్తి చేశాము. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మా పనిని పూర్తిచేశాము. మా సినిమా పనులు పూర్తికాగానే థియేటర్స్ ఓపెన్ కావడం ఒక రకంగా మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఏ సినిమా అయినా థియేటర్లలో చూసేటప్పుడు కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు.
ఈ సినిమాలో నేను .. నా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ గా కనిపిస్తాము. మా కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. కన్నడ ప్రాంతానికి చెందిన ‘గోవింద్ గోరా’ అనే పాత్రలో ఆయన కనిపిస్తాడు. ఆ పాత్రలో ఆయన అదరగొట్టేశాడు. ఆయన సెట్లో ఉంటే నవ్వులే నవ్వులు .. అస్సలు సమయం తెలిసేది కాదు. ఈ సినిమా హైలైట్స్ లో ఆయన పాత్ర ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనీ, విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. తరువాత ప్రాజెక్టులుగా ఇటీవలే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. త్వరలోనే వాటి పూర్తి వివరాలు తెలియపరుస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.