వైయస్ షర్మిల.. మొన్నటి వరకు కేవలం దిగంవత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా మాత్రమే అందరికీ తెలుసు. అంతేనా ఆమె గుర్తింపు అంటే కాదనే చెప్పాలి.. వైయస్సార్ పార్టీ కష్టకాలంలో పాదయాత్రకు పూనుకుని పార్టీని నిలబెట్టిన మహిళా నేత ఆమె. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ప్రచారం చేస్తూ.. పార్టీకి వెన్ను దన్నుగా నిలబడిన నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి షర్మిల నేడు తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు.
షర్మిల.. తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అనగానే.. జగన్ వదిలిన బాణమా.. వదిలేసిన బాణమా.. వదిలించుకన్న బాణమా.. కేసీఆర్ చాణక్యమా.. బీజేపీ రాజకీయమా.. ఇలా ఎన్నో ఆలోచనలు అందరి మదిలో మెదిలాయి. ఒకవేళ ఈ ఊహాగానాలన్నీ నిజమే అనుకుందాం.. ఇన్ని పార్టీలు తమ వ్యూహ్యంలో భాగంగా షర్మిలాను ఎంచుకున్నారంటేనే, ఆమె ఎంత శక్తిమంతురాలో తెలుస్తుంది. కానీ, వీటన్నింటికీ కాస్త భిన్నంగా చూస్తే.. అసలు షర్మిల స్వయంగా పార్టీ ఎందుకు పెట్టకూడదు.. ఏపీలో పెట్టడానికి అస్కారం లేదు.. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని తన సత్తా నిరూపించుకోవాలని ప్రయత్నం సాగిస్తుందా?
అసలు అలాంటి ఆలోచన చేయడానికి ఆమెకున్న సత్తా ఏంటి? అవకాశాలు ఏలా ఉన్నాయి? అసలామె పార్టీ పెట్టడం వల్ల ఎవరికెంత లాభం? ఎవరు నష్టపోబోతున్నారు? ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి.. షర్మిల మాత్రం సూటిగా.. స్పష్టంగా.. కొత్త పార్టీ దిశగా తన పని తాను చేసుకుపోతుంది.

షర్మిలకు అవకాశమెంత?
తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఓ ఏపీ వ్యక్తి పార్టీ పెట్టి నెగ్గుకురావడం కష్టమనే చెప్పొచ్చు. కానీ, ఆ కష్టంలోనే ఆమెకు కొన్ని అవకాశాలూ ఉన్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్ను అభిమానించే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. తండ్రి సెంటిమెంటును ప్రయోగించి వారి మద్దతు కూడగట్టుకోవడం షర్మిలకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అలాగే, తెలంగాణలో శక్తిమంతమైన మహిళా నేతలకు కొరత ఉంది. ఈమె గానీ తండ్రి బాటలో పాదయాత్ర చేపడితే.. ప్రజలకు చేరువైతే.. తెలంగాణ మహిళల మద్దతు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ స్థానిక మహిళల మద్దతు పొందగలిగితే.. షర్మిలపై క్రమంగా ఆంధ్ర అనే ముద్ర పోతుంది. అలాగే, తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో షర్మిల పార్టీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరో రెండు జిల్లాల్లో కొంతమేరకు ప్రభావం చూపించగలుగుతుంది. ఇలా.. ఏడు జిల్లాల్లో ప్రభావం చూపించగలగడం అనేది సాధారణ విషయం కాదు. ఈ ప్రభావం.. మిగిలిన మూడు జిల్లాలకూ తీసుకెళ్లడంలో ఆమె విజయవంతమైతే.. అధికారం సొంతమైనట్లే. ఈ పరిస్థితే వస్తే.. ఇప్పుడున్న రెండు ప్రధాన పక్షాల వ్యూహాలూ బెడిసి కొట్టినట్లే.
Must Read ;- జగన్ దూతగానే ఆళ్ల షర్మిలతో భేటీ అయ్యారా?

అసలు బీజేపికి కలిసొచ్చే లెక్కలేంటీ?
బీజేపీ వైపు నుంచి చూస్తే.. దుబ్బాక ఫలితం తర్వాత రాష్ట్రంలో బీజేపీ జోరు మీదుంది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలతో సత్తా చాటింది. ఈ రెండు ఎన్నికలనూ ఒక్కసారి పరిశీలిస్తే.. తెలంగాణ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్ల మద్దతు ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆ ఓట్లలో చీలిక షర్మిల గనక చీలిక తేగలిగితే.. బీజేపీ విజయం నల్లేరుపై నడకవుతుందనడంతో సందేహం లేదు.
కేసీఆర్కి ఏం లాభం?
షర్మిల పార్టీ వల్ల కేసీఆర్కు ఏంటి లాభం? అంటే.. చాలానే ఉందంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లో టీడీపీపై కన్నేశారు. ఆ పార్టీని బలహీనపరచి.. నాయకులను, కేడర్ ను తన పార్టీలోకి తీసుకున్నారు. అలా.. క్రమంగా తెలంగాణలోని టీడీపీ ఓట్ బ్యాంకును టీఆర్ఎస్ వైపునకు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, కేడర్ మొత్తం దాదాపుగా టీడీపీదే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత.. రెండోసారి అధికారం చేపట్టాక.. కేసీఆర్.. తన దృష్టిని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించారు. ఆ పార్టీ నాయకులను, కేడర్ ను ఆకర్షించడం మొదలెట్టారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేసి.. తెలంగాణలో తనకు ఎదురే లేకుండా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో విజయవంతమయ్యారు కూడా. కానీ, ఇక్కడే ఆయన కూడా ఊహించని విధంగా బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ కు చుక్కలు చూపిస్తోంది. దుబ్బక ఫలితం తర్వాత.. మరింతగా దూకుడు పెంచేసింది. హైదరాబాద్ ఫలితంతో కేసీఆర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అష్టదిగ్బంధం చేసేసి.. ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎదుర్కోనంతటి తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? కాంగ్రెస్ ఓట్లు.. ఈ సారి గంపగుత్తగా బీజేపీకి పడడమే అందుకు కారణమని చెప్పచ్చు. సంప్రదాయ బీజేపీ ఓట్లకు ఈ ఓట్లు జతకావడంతోనే అక్కడ టీఆర్ఎస్ ఓటమి పాలైందని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే పరిస్థితి హైదరాబాద్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇలాంటి పరిస్థితే రాష్ట్రమంతా ఏర్పడితే.. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం తథ్యం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లకుండా షర్మిల గనక దక్కించుకుంటే.. బీజేపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. తద్వారా కేసీఆర్ గెలుపు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరి చూడాలి.. రాగల మూడేళ్లలో రాష్ట్రంలో ఎన్ని రాజకీయ చిత్రాలు జరుగుతాయో.. ఏ పార్టీ తలరాత ఎలా మారుతుందో.. బీజేపీకి కలిసొస్తుందో.. కేసీఆర్కి లాభిస్తుందో.. లేక షర్మిలనే చక్రం తిప్పి తెలంగాణలో మహిళా నేతగా ఎదుగుతారో చూడాలి. మొత్తానికి ఈ పరిణామాలన్నింటి మధ్యా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
Must Read ;- పార్టీ ఏర్పాటు ఆమె అభిప్రాయమే.. షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సజ్జల











