ప్రజల ప్రధాన ఎంటర్టైన్మెంట్ సాధనమైన సిల్వర్ స్క్రీన్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో సినిమా హాల్లో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కోవిద్ 19 ప్రోటోకాల్ పాటించడంతో పాటు కొన్ని సూచనలతో చిత్రాల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులో ప్రధానమైనది థియేటర్లో భౌతిక దూరం పాటించడం. గతంలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రతిపాదన చేసినట్టుగా 50శాతానికి సీట్ల సామర్థ్యం పరిమితమయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు థియేటర్లలో బాడీ స్కానర్లు, శానిటైజర్ వినియోగం ప్రతి షో తర్వాత తప్పనిసరి కానుంది. నాలుగు నెలల విరామం తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే క్రమంలో కొద్దిరోజులపాటు వీటిని థియేటర్ల యాజమాన్యాలు భరించగల వేమో గాని… నెలల తరబడి కొనసాగించాలంటే థియేటర్లు మూసుకోవడం ఉత్తమమని అధిక శాతం యజమానులు అభిప్రాయపడుతున్నారు.
గత కొద్ది నెలలుగా ఓటీటీ ప్లాట్ఫారం లో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు దూరమయ్యారని చెప్పాలి. సీటింగ్ కెపాసిటీని 50 శాతానికి తగ్గిస్తే, టికెట్ ధరను 50శాతం పెంచాల్సి ఉంటుంది. అలా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. కోవిద్ 19 ప్రోటోకాల్ ప్రకారం థియేటర్ల నిర్వహణ ఖర్చు మరో 50 శాతం పెరుగుతుంది. వచ్చే ఆదాయం చూస్తే సగానికి పడిపోతుంది. ఈ తరుణంలో థియేటర్ల నిర్వహణ కష్టతరంగా మారుతుంది అని, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళితే ప్రస్తుతం నలుగురికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక టికెట్ ధరలు పెంచితే ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్.. ఆహా .. నెట్ఫ్లిక్స్ … డిస్నీ హాట్ స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్ ఫాంలు.. రెండు మూడు వందల కే ఏడాది సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి. ఈ లెక్కన థియేటర్ల వైపు ఎంతమంది వస్తారు అన్నది అంచనాకు కూడా చిక్కడం లేదు.
రెండున్నర గంటల పాటు ఏసీ థియేటర్ లో తలుపులు మూసి చేసే ప్రదర్శన కారణంగా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. దీంతో వైరస్ పై అవగాహన ఉన్న వర్గాలు ఏ మేరకు థియేటర్లకు వస్తారన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. బిగ్ స్క్రీన్ లో సినిమా చూసే అనుభూతిని ఆస్వాదించే ప్రేక్షకులు మాత్రం థియేటర్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్న ప్పటికీ అటు ఎగ్జిబిటర్లు గానీ, ఇటు డిస్ట్రిబ్యూటర్లు గాని అంతగా ఆసక్తి చూపటం లేదు.
సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ జిల్లాలో 2, 3 సినిమా థియేటర్లు తప్ప, అన్ని థియేటర్లు ఒకేసారి తెరచుకునే అవకాశం లేదని ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి 50% జీతాలు చెల్లిస్తున్నారు. విద్యుత్ బిల్లు నిర్వహణ ఖర్చు వెరసి ఒక్కో థియేటర్ యజమాని లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఒకసారి సినిమాల ప్రదర్శన మొదలయితే సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించడంతో పాటు నిర్వహణ ఖర్చు రెట్టింపు కావడం… సీటింగ్ కెపాసిటీ తగ్గడంవల్ల ఆదాయం సగానికి పడిపోవడం కారణంగా నష్టాలు రెట్టింపు అవుతాయి అని థియేటర్ యాజమాన్యాలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి.
సినిమా షూటింగులకు కూడా ప్రభుత్వాలు గతంలోనే అనుమతి ఇచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం తమ వల్ల కాక షూటింగ్ లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని కొందరు థియేటర్ మేనేజర్లు పేర్కొంటున్నారు.