ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ఫైనల్ స్టేజ్కు చేరినట్లే కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్లో బిగ్బాస్ ఎవరో సిట్ నిర్ధారణకు వచ్చేసింది. ఏపీలో 2019-24 మధ్య ఐదేళ్ల పాటు సాగిన లిక్కర్ స్కామ్లో అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొంది సిట్. లిక్కర్ వ్యాపారం ద్వారా వేల కోట్లు దోచుకోవడానికి జగన్ ఏయే నిర్ణయాలు తీసుకున్నారో కూడా సిట్ వివరించింది. సిఫార్సులకు భిన్నంగా అధికారుల నియామకాలు ఎలా జరిగాయో కూడా వెల్లడించింది.
లిక్కర్ స్కామ్ కేసులో CMO మాజీ కార్యదర్శి, రిటైర్డ్ IAS ఆఫీసర్ కాల్వ ధనుంజయరెడ్డి (A-31), జగన్ OSD పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి (A-32), భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (A -33) ప్రమేయం, పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. విజయవాడ ACB కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగపత్రం దాఖలు చేశారు. మొత్తం 124 పేజీలు..16కు పైగా వాల్యూమ్స్ సమర్పించారు. గతంలో వేసిన ప్రాథమిక అభియోగపత్రంలో ఏడుగురు వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా…వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై సిట్ అభియోగాలు నమోదు చేసింది. దీంతో 10 మంది వ్యక్తులు, 9 సంస్థలపై ఇప్పటివరకూ అభియోగాలు నమోదు చేసినట్లైంది.
తాజా అభియోగపత్రంలో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు తదితర అంశాలను పొందుపరిచింది.ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసేలా పక్కా ప్లాన్తో స్కామ్ చేశారని వివరించింది. దాదాపు రూ.3,500 కోట్ల విలువైన ఈ స్కామ్ మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు A-2 వాసుదేవరెడ్డి, A-3 సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది నాటి సీఎం జగన్కు ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం అని కూడా ఈ చార్జిషీట్లో వివరించింది.
అనుబంధ ఛార్జిషీట్లో కీలక అంశాలు –
ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే మద్యం విధానంలో మార్పులకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. 2019 సెప్టెంబరు 30 వరకు మద్యం దుకాణాల కొనసాగింపునకు, లైసెన్సుల మంజూరుకు అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 21న నిర్ణయం తీసుకున్నారు. 2019 అక్టోబరు ఒకటి నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషులను గుర్తించాలని స్వయంగా జగనే ఆదేశాలు ఇచ్చారు. 2019 జులై 29న నాటి ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే లిక్కర్ బిజినెస్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుకాణాల సంఖ్య, అవసరమైన చోట అద్దెకు తీసుకోవడం, ఆ దుకాణాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, సిబ్బంది, రవాణా ఛార్జీలు తదితర అంశాలు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు. ఆ సమావేశంలోనే బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా 3,500 రిటైల్ దుకాణాలు నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన జరిగింది. నాటి బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ 2019 జులై 30న నోట్ ఫైలు ప్రత్యేక ప్రధానకార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా అదే ఏడాది ఆగస్టు 16న నాటి సీఎం జగన్ ఆమోదం తెలియజేశారు.
A-2గా ఉన్న వాసుదేవరెడ్డిని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా నియమించుకున్నారు. ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ఈ అంశాన్ని ప్రభావితం చేశారు. అప్పటి సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వాసుదేవరెడ్డిని ఆంధ్రప్రదేశ్కు డిప్యుటేషన్పై తీసుకురావాలంటూ నాటి సీఎంకు ప్రతిపాదనలు పంపారు. రైల్వే మంత్రిత్వశాఖతో మాట్లాడాలని సూచించారు. స్క్రీనింగ్ కమిటీ వాసుదేవరెడ్డి నియామకానికి సిఫార్సు చేసింది. తగిన పోస్టులో నియమించాలని పేర్కొంది. ఆ నోట్ఫైల్ను అప్పటి సీఎం జగన్ ఆమోదించారు.
రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన వాసుదేవరెడ్డిని(A-2) బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా లేదా- తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగానైనా నియమించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోదియా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి జగన్లకు ఫైలు పంపారు. వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేశారు. అప్పటికే ఉత్తర్వులు జారీ చేసేశామని నాటి ముఖ్యమంత్రి జగన్ ఒక నోట్ ద్వారా 2019 సెప్టెంబరు 16న తెలియజేశారు. బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఆయనను బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా డిప్యుటేషన్పై నియమిస్తూ 2019 సెప్టెంబరు 13న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన సెప్టెంబరు 16న బాధ్యతలు తీసుకున్నారు. క్యాడర్ పోస్టులోకి ఆయనను ఎందుకు తీసుకున్నారో కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత నాటి సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం సిఫార్సుల మేరకు ఆయను డిస్టలరీలు, బ్రేవరీస్ కమిషనర్గాను, బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగాను నియమించారు. అనంతరం డి.సత్యప్రసాద్(A-3)ని బేవరేజస్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా నియమించారు. అజేయకల్లం రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి సిఫార్సు మేరకు ఈ నియామకం చేపట్టారు.
నాడు బేవరేజస్ కార్పొరేషన్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నా..ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలూ తీసుకోలేదు. ప్రధానంగా మద్యం సరఫరా ఉత్తర్వుల విషయంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారమే ఈ ఉత్తర్వులు ఇవ్వాలని బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ ప్రత్యేకాధికారికి లేఖలు రాశారు. ఆ ఫైళ్లు ఏవీ ఎండీకి పంపకుండానే ప్రత్యేకాధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు.ఈ అంశాలు ప్రస్తావిస్తూ నాడు ఎండీ రాసిన లేఖ ఎక్సైయిజ్ కమిషనర్కు వెళ్లినా ఆయన చర్యలూ తీసుకోలేదు. అవకతవకలు జరిగినట్లు 2020లోనే గుర్తించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రికార్డులు తెలియజేస్తున్నాయి.
బేవరేజస్ కార్పొరేషన్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించినా వాసుదేవరెడ్డి (A-2), సత్యప్రసాద్ (A-3)లపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయరెడ్డి (A-31), కృష్ణమోహన్రెడ్డి (A-32) ఒత్తిడి చేసినట్లు నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్ విచారణలో వెల్లడించారు. ఈ అక్రమాలపై ఎండీ వాసుదేవరెడ్డికి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్కు మెమోలు వరుసగా జారీ చేసినా వారు స్పందించలేదు. ఎలాంటి జవాబు ఇవ్వలేదని రజత్భార్గవ వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయరెడ్డికి కూడా తెలియజేసినట్లు రజిత్ భార్గవ వెల్లడించారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇమ్మని కోరినా ఇవ్వకపోగా వారుచేసిన పనులను ర్యాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలని తనను ఒత్తిడి చేసినట్లు సిట్కు తెలియజేశారు.
ఇన్ని అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు 2022 నాటికే తెలిసినా చర్యలూ తీసుకోలేదు. పైగా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలు బేవరేజస్ కార్పొరేషన్ అక్రమాలపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని ఆదేశించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కుంభకోణంలో వారు పూర్తి స్థాయిలో భాగస్వామ్యులయ్యారన్న విషయమూ తేలుతోంది











