సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా – ఈ మాట తరచూ అనే వ్యక్తి మరెవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు సినిమా రంగం మే 4వ తేదీన డైరెక్టర్స్ డే జరుపుకుంటోందీ అంటే దాసరి స్టామినా ఏమిటో ప్రత్యేకించి చెప్పేదేముంది.
దాసరి అనే మాటను ఎందరో దర్శక దిగ్గజాలు నిరూపించారు కూడా. దాసరికి ముందు తరంలోనూ, దాసరి తర్వాత తరంలోనూ సినిమాకు డైరెక్టరే కెప్టెన్ అనే మాటను ఎందరో నిరూపించారు. నిన్నటి తరంలో కె. రాఘవేంద్రరావు, నేటి తరంలో ఎస్.ఎస్. రాజమౌళి లాంటి వారు మన ముందుండి ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు కూడా. నిజానికి దాసరి శకం అనేది తెలుగు సినిమాకు ఓ శతకంగానే చెప్పాలి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా సినిమా రంగానికి విషయానికి వస్తే దాసరికి ముందు, దాసరికి తర్వాత అనే చెప్పాలి. 250 చిత్రాలకు పైగా మాటల రచయితగా, దాదాపు 150 చిత్రాల దర్శకుడిగా, మరెన్నో చిత్రాల్లో నటుడిగా ఆయన పయనం అనితర సాధ్యం.
తెలుగు సినిమా రంగంలో దాసరి సృష్టించిన రికార్డును మున్ముందు మరెవరూ సాధించలేరనడం అతిశయోక్తి కాదు. దాసరి అనే యూనివర్శిటీ నుంచి వచ్చి ఎందరెందరో ప్రముఖ దర్శకులైన సంగతిని కూడా మనం గుర్తుంచుకోవాలి. 1947 మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన జన్మించారు. స్వయంకృషితో సినిమా రంగంలో ఎదగడం మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా స్టార్ హీరో అనే పదమే మనం విన్నాం స్టార్ డైరెక్టర్స్ ను ఇప్పుడు చూస్తున్నాం. హీరో కాల్ షీట్స్ కోసం క్యూకట్టే రోజుల్లో దాసరి లాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఉబలాటపడిన హీరోలు ఎందరో.
దాసరి డైలాగులు డైనమైట్లే
ఈ రోజున రాజమౌళి అలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఏదో సినిమాలో ‘బోనులో ఉన్నా అడవిలో ఉన్నా పులి పులేను డోంగ్రే’ అంటూ ఎస్పీ రంగారావు పలికిన డైలాగు మాదిరిగానే సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా దా‘సరిలేరు నాకెవ్వరూ’ అనుకునేలా చేశారు. సినిమాల్లో దాసరి డైలాగులు డైనమైట్లు పేలినట్టుగా ఉండేవి. డైలాగుల విషయంలో దాసరి ఎంతటి కసరత్తు చేసేవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయన బతికి ఉన్నంత కాలం తెలుగు సినిమాకు పెద్దన్నగానే వ్యవహరించారు.
సినిమా రంగంలో ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి పరిష్కరించేవారు. దర్శకుడిగా మొదటి సినిమా ‘తాతామనవడు’తోనే నంది అవార్డును అందుకున్న ఘనత ఆయనది. దర్శకుడిగానే కాదు నటుడిగానూ ఆయన ఇంటికి నందులు నడిచి వచ్చాయి. సినిమా రంగంలో హీరోలను ‘బాబు గారూ’ అంటూ ఎలా అంటారో ఒక్క దాసరిని మాత్రమే ‘గురువు గారూ’ అంటూ అందరూ పిలిచేవారు. ఎలా పిలిచినా ఎప్పుడు పలిచినా పలికేవక్తి ఆయన. ముఖ్యంగా ఆయన పుట్టిన రోజు వస్తోందంటే చాలు ఎందరికో పండగలా ఉండేది.
తన సన్నిహితులందరినీ ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేవారు. ఒక దర్శకుడికి 18000లకు పైగా అభిమాన సంఘాలు ఉండేవాంటే ఆయన స్థాయి, స్టామినా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సినిమాను త్వరగా పూర్తి చేయడం ఎలాగో దాసరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఇవాళ అలా త్వరగా పూర్తి చేసే దర్శకుల జాబితాలోకి పూరి జగన్నాథ్, క్రిష్ లాంటి కొద్ది మంది దర్శకులు మాత్రమే వస్తారు. ముఖ్యంగా నిర్మాత కష్టసుఖాలు తెలిసిన దర్శకులు అరుదు.
దర్శకుడిగా ఆయన రత్నం
తెలుగు సినిమాకు రెండు కళ్లు అనుకునే ఎన్టీఆర్, ఏయన్నార్ లతో దాసరి ఇచ్చిన హిట్లు, అవిసాధించిన రికార్డులు అసాధారణం. ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ఏయన్నార్ తో ఏడంతస్తులమేడ, ప్రేమాభిషేకం, మేఘసందేశం, కృష్ణ, శోభన్ బాబులతో కృష్ణార్జునులు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇక నటుడిగా ఆయన సత్తా ఏమిటో చూడటానికి ఒక్క ‘మామగారు’ చాలు. విలక్షణ నటుడు మోహన్ బాబును తన చేతుల మీదుగానే వెండి తెరకు పరిచయం చేశారు. ఇలా దాసరి పరిచయం చేసిన నటులు, దర్శకుడు ఎందరో. దర్శకుడిగా రాణించి రాజకీయాల వైపు పయనించి కేంద్ర మంత్రిగానూ దాసరి తానేమిటో నిరూపించుకున్నారు.
తప్పుటడుగులూ తప్పలేదు..
అప్పు చేయనివాడు తప్పు చేయని వాడు ఏ రంగంలోనూ ఉండడు. సినిమా అనేది ఓ మాయ. ఇలాంటి మాయలో తప్పుటడుగులు తప్పదు. అలా తప్పటడుగులు వేసి జీవితం తల్లకిందులైతే ‘ఏడంతస్తుల మేడ’ కూడా కూలుతుంది. జీవితం సాఫీగా సాగినంతకాలం ఎవరైనా ‘బహుదూరపు బాటసారే’. ‘స్వయంకృషి’తో ఎదిగినా స్వీయ అపరాధాలు ఒక్కోసారి మానసికంగా కుంగదీస్తాయి. అది దాసరి విషయంలోనూ జరిగింది. సినిమాను శాసించగలిగిన దాసరి కుటుంబాన్ని శాసించలేకపోయారన్న అపనిందను మూటగట్టుకున్నారు.
ఎంతటి ‘బోళాశంకరుడు’ అయినా బోల్తాపడక తప్పదని తన వారసుల్ని సినిమా రంగంలో నిలబెట్టడంలో రుజువైంది. నలుగురితో ‘నారాయణ’ అనుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నలుగురిలో నారాయణ వేరు అనుకుంటేనే వాటిని సవాలుగా తీసుకోవాలి. లేకుంటే ‘బలిపీఠం’ ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి తప్పిదం దాసరి ‘ఉదయం’ పత్రిక పెట్టడంలో చేశారు. ఈనాడు రామోజీరావుతో ఢీ అంటే ఢీ అన్నారు. సినిమాల్లో ఆయన చూపించిన సంఘర్షణ ఎలాంటిదో కుటుంబం విషయంలో తాను స్వయంగా అనుభవించారు.
ఇది ఇంటింటిభాగోతమే అనుకోడానికి వీల్లేదు. నలుగురికి దారి చూపిన వ్యక్తి కాబట్టి ప్రశ్నించేవాళ్లు కూడా ఉంటారు.. అవి ‘నీడ’లా వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఆత్మీయత, అనుబంధం అంతా బూటకం అని ఆయన తన మొదటి సినిమా ‘తాత-మనవడు’లో చెప్పినట్టుగానే జీవితంలో కనిపించింది. అందుకే దాసరి జీవితమే ఓ ‘మేఘసందేశం’ అనుకోవాలి. అందుకే దాసరి శకం చిత్రపురికి ఓ శతకం అనక తప్పదు.