సినిమా కలెక్షన్లు చెప్పాల్సి వస్తే నాన్ బాహుబలి రికార్డు అంటున్నారు. తెలుగు సినిమా స్టామినా గురించి మాట్లాడాల్సి వస్తే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనే మాట వింటున్నారు. అతను అంత బాహుబలిగా ఎందుకు మారాడు.
అతను ఆజానుబాహుడు.. అరవింద దళాక్షుడు.. ఈశ్వర్ అంటూ తెరంగేట్రం చేశాడు.. రాధేశ్యామ్ గా మళ్లీ మనముందుకు వస్తున్నాడు. అమరేంద్ర బాహుబలిగా మారాక అందరి కళ్లూ అతని వైపే చూస్తున్నాయి.. ఇంతకీ అతనెవరు?.. ఇంకెవరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. శభాష్ అంటూ ఆశీర్వదిస్తున్నారు పెదనాన్న ఒకప్పటి రెబల్ స్టార్ కృష్ణంరాజు. నిజానికి రెబల్ స్టార్ అనే పదం అప్పట్లో ఐదో స్థానానికే పరిమితమైంది. అది పాన్ ఇండియా పదమవుతుందని కృష్ణంరాజు కూడా ఊహించి ఉండరు. ఆ ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబరు 23.
18 ఏళ్లు వెనక్కి వెళితే..
2002లో హైదరాబాద్ ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోలో ఓ సినిమా ఓపెనింగ్ జరిగింది. మరో నటవారసుడు వస్తున్నాడు అన్నారంతా. హీరో కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతుల కుమారుడు ప్రభాస్ స్టూడియోలో అడుగుపెట్టగానే అందరూ అన్న మాట.. ‘కుర్రాడు బాగున్నాడు.. మంచి హైటు’ అని. ప్రముఖ నిర్మాత రామానాయుడు మేనల్లుడు అశోక్ కుమార్ నిర్మాతగా ‘ఈశ్వర్’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ. పాత్ర పేరుతోనే అతని మొదటి సినిమా ప్రారంభమైంది. రెండో సినిమా కూడా పాత్ర పేరుతోనే. అది ‘రాఘవేంద్ర’.
మొదటి సినిమా ఫరవాలేదనిపించినా రెండో సినిమా చూసి అంతా పెదవి విరిచేశారు. ఆ తర్వాత పాత్ర పేరు పోయింది. ‘వర్షం’ వచ్చింది. పైగా పెద్ద సినిమాలతో విడుదలైంది. మొదటి రోజు సరైన టాక్ లేదు. బహుశా అంతకుముందు సినిమాల ప్రభావం కావచ్చేమో అనిపించింది. కానీ నిదానంగా వర్షం కాస్తా పెరిగి పెద్దదైంది. అది బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షమే కురిపించింది. ముఖ్యంగా పాటలు ఆ సినిమాని ఓ స్ఠాయిలో లేపేశాయి. హీరోయిన్ త్రిష కూడా ఆ సినిమాకి పెద్ద ఎస్సెట్ గా మారింది. అప్పటిదాకా ప్రభాస్ గురించి ఆలోచించని సినీ జనం మరో మంచి హీరో దొరికేశాడు అనుకున్నారు. అతని ప్రభ అక్కడితో ఆగలేదు.. ‘ఛత్రపతి’లోని శివాజీ పాత్రతో మరో స్టార్ ని చూపించింది. పైగా ఆ సినిమాకి దర్శకుడు రాజమౌళి. అప్పటికి రాజమౌళి మీద కూడా పెద్దగా ఎలాంటి అంచనాలూ లేవు. మళ్లీ ఆ తర్వాత రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మున్నా’ వచ్చాక మళ్లీ ప్రభాస్ ఊపిరిపీల్చుకోగలిగారు. ఆ తర్వాత పూరి జగన్నాధ్ ‘బుజ్జిగాడు’గా ముందుకు తెచ్చారు. ఎన్ని వచ్చినా ‘ఛత్రపతి’ విజయానికి దరిదాపుల్లోకి రాలేకపోయాయి. ‘డార్లింగ్’ సినిమా వచ్చాక ప్రభాస్ అందరికీ డార్లింగ్ గా మారిపోయాడు. ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’తో యూత్ మనసుల్లోకి కూడా చేరిపోయాడు. ‘మిర్చి’తో మరచిపోలేని హీరో అయ్యాడు. సక్సెస్ అయిన ప్రతి సినిమా అతన్ని మాస్ హీరోగానే నిలబెట్టాయి. ‘రాధేశ్యామ్’ దాకా అతని 20 సినిమాల ప్రయాణంలో ఒకే ఒక్క సినిమా అతని దిశ, దశలను మార్చేసింది. ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఆ ఒక్క సినిమా రెండుగానూ మారింది. రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది.
రాజమౌళికి సారీ చెప్పేస్తే ఏమయ్యేది?
‘సారీ రాజమౌళీ.. నీకోసం నా కెరీర్ ను వదులుకోలేను’ అని ప్రభాస్ అని ఉంటే.. ప్రభాస్ ఏమిటి, రాజమౌళికి సారీ చెప్పడమేంటి అనుకుంటున్నారా? ప్రభాస్ ముందుకు రాజమౌళి తెచ్చిన ‘బాహుబలి’ ప్రపోజల్ అలాంటిదే. 2013లో ఫిబ్రవరిలో ‘మిర్చి’ సినిమా విడుదలైంది. ఆ తర్వాత రాజమౌళికి సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్. రాజమౌళి షూటింగ్ అంటే అంతో ఇంతో ఆలస్యం అవుతుందని ప్రభాస్ కు తెలుసు. పైగా బాహుబలికి ఎక్కువ రోజులు కేటాయించాల్సిందిగా కూడా రాజమౌళి అడిగారు. దాదాపు రెండేళ్లపాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఇంతకాలం షూటింగా అనుకుని ప్రభాస్ నో చెప్పేసి ఉంటే ‘బాహుబలి’ ప్రభాస్ ఖాతాలోకి వెళ్లి ఉండేదే కాదు.
ఆ సినిమా రెండు భాగాలుగా రూపొందడంతో ప్రభాస్ త్యాగాలకు సిద్ధపడక తప్పింది కాదు. ఈ సినిమా ఒప్పుకుని తప్పు చేశానా? అని ప్రభాస్ షూటింగ్ మధ్యలో అనుకుని కూడా ఉండొచ్చు. కానీ ఆ త్యాగం ఊరికే పోలేదు. ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా చేసినా పాన్ ఇండియా కలర్ వచ్చేస్తోంది. ‘సాహో’లో అంత దమ్ము లేకపోయినా దుమ్ము రేగ్గొట్టింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ రాబోతోంది. ఆ తర్వాత ‘ఆదిపురుష్’, దాని తర్వాత నాగ్ అశ్విన్ తో వైజయంతీ మూవీస్ సినిమా.. ఇలా అతను చేసే ప్రతి సినిమా ‘బాహుబలి’కి సమాంతరంగానే రూపొందుతున్నాయి. నాటి ఈశ్వర్ పాత్ర నుంచి నేటి రాధేశ్యామ్ విక్రమాదిత్య పాత్ర దాకా అతడు బాహుబలిగా ఎదిగాడంటే దాని వెనుక ఉన్న కృషి, కసి మామూలుది కాదు.
ఓ దర్శకుడి మీద అతడు పెట్టుకున్న నమ్మకం అతడిని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి కాల్ షీట్లను ఏ హీరో కూడా ఇవ్వడు. రాజమౌళి అనే దర్శకుడిని ప్రభాస్ నమ్మాడు, అలా తన డేట్లు ఇచ్చాడు. అదే మరొకరైతే ఇంత కెరీర్ ని వదులుకుని ఒక్క సినిమా కోసం ఇంత కాలం వృధా చేయను.. సారీ రాజమౌళీ అని చెప్పేస్తారు. అందుకే ప్రభాస్ ఇప్పుడు ఎంతో ఎదిగిన నటుడు.. ఇక అతను నటనలోనూ, వ్యక్తిగానూ ఒదిగిపోతూ ముందుకు పోవలసిందే. మన పాన్ ఇండియా స్టార్ కు ‘లియోన్యూస్’ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.
– హేమసుందర్ పామర్తి