చారడేసి కళ్లతో .. కోరచూపులతో .. కొంటె నవ్వులతో .. ముద్దుముద్దు మాటలతో .. పడుచు హృదయాలపై పదనిసలు పలికించిన కథానాయిక బి.సరోజాదేవి. దారితప్పి వచ్చిన దేవకన్యలా .. గడపదాటి వచ్చిన గంధర్వ కన్యలా .. వనాలు విడిచి వచ్చిన వనకన్యలా తెలుగు తెరపై ఆమె చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు. అలనాటి కథానాయికలలో సావిత్రికి ఎదురుండేది కాదు. గ్లామర్ పరంగా జమున .. కృష్ణకుమారికి తిరుగుండేది కాదు. అలాంటి సమయంలోనే అందం .. అభినయం రెండూ కలగలిసిన నాయికగా బి.సరోజాదేవి ఎంట్రీ ఇచ్చారు.
కనురెప్పలను టపటపలాడిస్తూ తెరపై ఆమె చేసిన చూపుల విన్యాసాలు చూసి, అప్పటి కుర్రాళ్లు ఆమె అభిమానులుగా మారిపోయారు. ఆ కనురెప్పల మధ్య చిక్కుకుని నాజూకుగా నలిగిపోవాలని ఆశపడ్డారు. ఆనాటి స్టార్ హీరోయిన్స్ తెలుగు బాగానే మాట్లాడేవారు. అయితే బి. సరోజాదేవి కన్నడ నుంచి రావడం వలన తెలుగు అంతగా వచ్చేది కాదు. అయినా అలాగే మాట్లాడేసేవారు. అంతగా రాని తెలుగు ఒక యాసగా మారిపోయి అదో కొత్తదనమైపోయింది. అలా ముద్దుముద్దు మాటలతోనే ఆమె మరింతమంది అభిమానుల మనసులను మూటగట్టారు.
బి.సరోజాదేవి తండ్రికి నటన పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. దాంతో ఆయన నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ ప్రభావం ఆమెపై కూడా పడింది. 13 ఏళ్ల వయసులో ఆమె ఒక నాటకంలో నటిస్తూ ఉండగా కన్నడ దర్శక నిర్మాత ‘హొన్నప్ప భాగవతార్’ చూసి, ‘మహాకవి కాళిదాస’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా కన్నడ సినిమా ద్వారా నటిగా ఆమె కెరియర్ మొదలైంది. తెలుగులో ఆమె ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో శృంగార పురుషులను ఆకట్టుకునే ‘కళావతి’ పాత్రలో ఆమె మెప్పించారు.
50వ దశకం ద్వితీయార్ధంలోనే తన ఉనికిని చాటుకున్న సరోజాదేవి, 60వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. ఈ దశకంలో ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువ భాగం సూపర్ట్ హిట్లుగా నిలిచాయి. ఈ దశకంలో వచ్చిన ‘పెళ్లికానుక’ .. ‘జగదేకవీరుని కథ’ ..’ ఆత్మబలం’ .. ‘ శ్రీకృష్ణార్జున యుద్ధం’ .. ‘శకుంతల’ .. ‘అమరశిల్పి జక్కన్న’ వంటి సినిమాలు ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి. తనని తాను తీర్చిదిద్దుకుంటూ గ్లామర్ పరంగా కూడా ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. థియేటర్ ను వదిలి ఇళ్లకు వెళ్లాలంటే బెంగపెట్టుకునేంతగా అభిమానులను ఆకట్టుకున్నారు.
‘జగదేకవీరుని కథ’ చూసినవారు, నిజంగానే ఆమె దేవకన్య ఏమో అనుకున్నారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’చూసినవారు ‘ సుభద్ర’ ఇలాగే ఉండేదేమోనని అనుకున్నారు. ‘శకుంతల’ చూసినవారు .. దుశ్యంతుడు ఉన్నపళంగా మనసు పారేసుకోవడంలో అర్థం ఉందనుకున్నారు. ‘అమరశిల్పి జక్కన్న’ చూసినవారు .. ఇంతటి సౌందర్య రాశిని అంత దగ్గరగా చూసినవాళ్లు కవులో .. శిల్పులో కావడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నారు. ‘పెళ్లికానుక’ సినిమాలో ఆమె రెండు జడలు వేసుకుని సైకిల్ పై కాలేజ్ కి వెళుతుంటే, ఆ కాలేజ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలామంది కుర్రాళ్లు ఉత్సాహపడ్డారు .. ఉబలాటపడ్డారు.
ఈ సినిమాలో ‘కన్నులలో పలకరించు వలపులు .. ‘ పాట చూస్తే, ఆమె కళ్లపైనే రాశారేమోనని అనిపించకమానదు. ఇక ‘ఆత్మబలం’ సినిమాలో ‘చిటపట చినుకులు .. ‘పాటలో తడుస్తూ కళ్లతో ఆమె వేసిన కోలాటాలు చూసి చాలామంది తమని తాము మరిచిపోయారు. ఇప్పటికీ ఆ పాట ఎక్కడైనా వినిపిస్తే మనసుకి ముసురుపట్టినట్టుగానే అనిపిస్తుంది. ఇలా తెరపై సరోజాదేవి సిగ్గుదొంతరలు పేరుస్తూ .. వయ్యారాలుపోతూ, ప్రేక్షకులను మురిపించారు .. మైమరపించారు. అప్పట్లోనే తన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ఇతర హీరోయిన్లకు భిన్నంగా కనిపించడానికి ఆమె ప్రయత్నించారు .. సఫలీకృతులయ్యారు.
తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. కన్నడలో అలనాటి స్టార్ హీరో అయిన రాజ్ కుమార్ తో ఆమె నటించారు. తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .. జెమినీ గణేశన్ లతో ఆడిపాడారు. హిందీలో దిలీప్ కుమార్ .. సునీల్ దత్ .. రాజేంద్రకుమార్ జోడీగా మెప్పించారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సరసన అలరించారు. సాంఘిక .. జానపద .. పౌరాణిక చిత్రాల్లో నాయికగా తనదైన ముద్రవేశారు. ఇలా ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో నటించిన ఆమెను ఎన్నో బిరుదులు .. మరెన్నో అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ‘పద్మశ్రీ’ .. ‘పద్మభూషణ్’ పురస్కారాలు ఆమె కీర్తి కిరీటంలో నిలిచాయి.
తనలోని అందానికీ .. అభినయానికి పోటీ పెట్టేసి ఆ తమాషాని అల్లరి కళ్లతో వీక్షించే కథానాయికగా బి. సరోజాదేవిని గురించి చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో ఎక్కువ మార్కులు దేనికి ఇస్తారు? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే తెరపై ఆమె చేసే చూపుల మాయాజాలంలో చిక్కుకుని మార్కుల ఊసే మరిచిపోయే అవకాశాలు ఎక్కువ. తెలుగు కథానాయికలలో ‘అతిలోక సుందరి’ ఎవరంటే దాదాపుగా అందరూ శ్రీదేవి పేరే చెబుతారు. ఆమెకంటే ముందున్న తారల్లో ‘అతిలోక సుందరి’ ఎవరంటే మాత్రం ఎవరైనా సరే బి.సరోజాదేవి పేరు చెప్పాల్సిందే. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆ నట పారిజాతానికి ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ