జగన్ సర్కారుపై సీబీఐ మాజీ డైరక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 24,846 ఆలయాలను సర్కారు కబ్జా చేసిందని, చర్చిలు, మసీదుల జోలికి వెళ్లలేదని ట్వీట్ చేశారు. వాటని వెంటనే రిలీజ్ చేయాలని, తమ పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను (గురుద్వార్ ) రక్షించుకునేలా అమలు చేస్తున్న చట్టం తరహాలో ఇక్కడా చట్టం తేవాలని, హిందూ ఆలయాలను హిందూ సమాజానికి ఇచ్చేయాలని, అప్పుడే అలజడి తగ్గుతుందని వ్యాఖ్యానించారు. మీకు ఆసక్తి ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు, సంచలన కేసులు దాఖలు చేసే వ్యక్తిగా పేరున్న సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ.. మీరు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా అడిగితే బాగుంటుందని, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
హిందూ ఆలయాల విముక్తి కోసం ప్రయత్నిస్తుంటే..
దీనికి నాగేశ్వరరావు కౌంటర్ ఇస్తూ.. ఆయా విభాగాల చెరలో ఉన్న హిందూ ఆలయాల విముక్తి కోసం ప్రయత్నిస్తుంటే..ఇలా ప్రశ్నించడం విచారకమని, నేను గత జులైలోనే పదవీ విరమణ చేసిన విషయం గుర్తించాలన్నారు. కాగా..పలు రాష్ట్రాల్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలపై నాగేశ్వరరావు ట్వీట్లు చేస్తున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు ఓ లేఖ విడుదల చేశారు. హిందూ ధర్మానికి, హిందువులకు ప్రాధాన్యం ఇచ్చేవారిని ఎన్నుకున్నప్పుడే మన మతానికి గౌరవం ఉంటుందని ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో ఆయన ట్వట్ లు చేసిన దానికంటే…తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు చేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇక నాగేశ్వరరావు పూర్వికులు ప్రకాశం జిల్లాకు చెందినవారు కాగా.. నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో పలు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో పని చేశారు. వివిధ హోదాల్లో పనిచేసి కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్గా గత ఏడాది జులైలో పదవీ విమరణ చేశారు. గతంలో సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, అడిషనల్ డైరక్టర్ రాకేష్ ఆస్తానాల వివాదం నేపథ్యంలో తత్కాలిక సీబీఐ డైరక్టర్గా బాధ్యతలు స్వీకరించారు నాగేశ్వరరావు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మద్రాస్ ఐఐటీలో రీసెర్చి చేశారు.
ట్వీట్పై చర్చ..
పదవీ విమరణ చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయా ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండడం, లేదా విమర్శలు చేయడం సాధారణమే. అయితే తన సర్వీసులు కీలక కేసుల విచారణ, సంచలన కేసుల దర్యాప్తు, పలు వివాదాలను ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు ట్వీట్పై ప్రత్యేక చర్చ నడుస్తోంది. భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
https://twitter.com/MNageswarRaoIPS/status/1346455603359567874?s=20
సంచలనం రేపిన స్వామిజీ హత్య కేసు విచారణ..
ఒరిస్సాలో 2007-08లో హిందువులకు సుపరిచితుడైన స్వామి లక్ష్మమానంద సరస్వతిని 83 ఏళ్ల వయస్సులో కొందరు హత్య చేశారు. అప్పట్లో కంద (గిరిజన తెగ) నిరసన విద్వంసానికి దారి తీసింది. అప్పట్లో ఈ ఘటనలో షూట్ అండ్ సైట్ ఆర్డర్ అమలైంది. ఆ సమయంలో ఈ హత్య నక్సల్స్ పనిగా చెబుతున్నా.. వెనుక కొన్ని మిషనరీలున్నాయన్న సమాచారంతో వారిపై దాడులు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అప్పట్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలయ్యాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. అప్పట్లో ఆ ఏరియాలో డీఐజీగా పని చేశారు నాగేశ్వరరావు. ఆ కేసుకు సంబంధించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో.. అట్రాసిటీ లిట్రేచర్ అడ్డుగా పెట్టుకుని వారు దేశం పేరును చెడగొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరాధ్య దేవుడిగా భావించే వ్యక్తిని చంపి, హింసను ప్రేరేపించి..మళ్లీ రక్షణ లేదని కొందరు గొడవలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అప్పట్లో ఈ కేసు విచారణపైనా ఆయన ఆరోపణలు చేశారు.సీఆర్పీఎఫ్కి డిప్యూటేషన్పై వెళ్లారు.2011లో కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు) ఎన్ కౌంటర్ లోనూ కీలక భూమిక పోషించారు.
హిందూ మతంపై జరుగుతున్న దాడులపై..
హిందూ మతంపై జరుగుతున్న దాడులు, హిందూ మతానికి వ్యతిరేకంగా అమలవుతున్న విధానాలపై కొన్నాళ్లుగా నాగేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లపై సీపీఎం నాయకురాలు బృందా కారత్ కేసు కూడా పెట్టారు. గతంలో బీహార్లోని ముజఫరాబాద్లో ఓ వర్గానికి చెందిన వసతి గృహాల్లో వేధింపుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిగిన విషయం తెలిసిందే. ఆ దర్యాప్తు విషయంలో తమకు తెలియకుండా సదరు విచారణాధికారిని మార్చవద్దని సుప్రీంకోర్టు ఆధేశాలున్నా నాగేశ్వరరావును బదిలీ చేశారన్నకారణంతో జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక గోమాంస ఎగుమతిని నిలిపి వేయాలని, గో సంరక్షణ చేపట్టాలనే కోణంలో ఆయన ఇటీవలే మరో ట్వీట్ చేశారు. 1966లో గో హత్యను నిషేధించాలన్న డిమాండ్తో పార్లమెంటు ఎదుట ఆందోళనలు జరిగితే.. అప్పట్లో పోలీసు కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ప్రస్తుతం ప్రపంచంలో గోమాంస ఎగుమతుల్లో భారత దేశం తొలి ఐదు స్థానాల్లో నిలవడం బాధాకరమని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. మొత్తం మీద ఆలయాలపై దాడుల వ్యవహారంలో దేశ వ్యాప్తంగా వైఎస్ సర్కారు అపప్రద మూటగట్టుకున్న నేపథ్యంలో ఓ వైపు ప్రతిపక్షాలు, మరోవైపు హిందూ ధార్మిక వేత్తల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నాగేశ్వరరావు చేసిన ట్వీట్ కూడా సంచలనంగా మారింది.
మరో సంచలనం రేపుతారా..
నాగేశ్వరరావు చేస్తున్న ట్వీట్లను పరిశీలిస్తే.. కొన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, కొందరు అధికారులు, కొందరు వ్యక్తులు చేపడుతున్న హిందూ వ్యతిరేక విధానాలను, మత మార్పిడులను ఎండగట్టనున్నారని అర్థం అవుతోంది. మరి రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగితే..వాటి విషయాల్లో ఎలా స్పందిస్తారో చూడాలి.











