‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో ప్రచారంలోకి వచ్చి రజినీకాంత్ పార్టీకి పురిట్లోనే సంధి కొట్టింది. వర్తమాన తమిళ రాజకీయాలకు సంబంధించి.. రజినీకాంత్ పార్టీ ఒక మృతశిశువు.
రెండు రోజుల్లో పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించడానికి ముహూర్తం పెట్టిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ ప్రారంభించలేనని చెప్పేశారు. రజినీకాంత్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. తన చేతి సంజ్ఞలతో కొన్ని కోట్ల మందిని శాసించగల వ్యక్తిగా ఆయనకు పేరుంది. నిజానికి ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి.
ఆ శక్తి విశ్వరూపం ఏమిటో రాష్ట్ర ప్రజలకు, దేశానికి కూడా తెలియజెప్పడమే టార్గెట్ అన్నట్టుగా ఆయన రాజకీయ పార్టీ ఆలోచన చేశారు. నిజానికి రజినీ పార్టీ అనేది కొన్ని దశాబ్దాల నుంచి వినిపిస్తున్న మాట. ఊరించి ఊరించి.. ఆ పేరు మీద రాజకీయ యాంగిల్ చొప్పించిన అనేక సినిమాలను కమర్షియల్ విజయాలుగా కూడా మలచుకున్న తర్వాత.. రజినీ చివరి ముహూర్తం ప్రకటించి.. అప్పుడే కాడి పక్కన పడేశారు. ఆరోగ్య పరిస్థితులు, సమాజంలో కరోనా నేపథ్యం ఇత్యాది కారణాల దృష్ట్యా ఇప్పుడు తాను పార్టీ పెట్టలేనని, అభిమానులు ఇందుకు తనను క్షమించాలని తలైవా చెప్పారు. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడతారని తెలుసు గానీ.. ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేనని, 120 మందితో షూటింగులోనే కరోనా సమస్య ఉన్నప్పుడు, లక్షల మంది వచ్చే రాజకీయ సభలతో వారికి హాని చేయలేనని అందుకే పార్టీ ఆలోచన విరమించుకుంటున్నానని రజినీకాంత్ చెప్పారు.
పార్టీ పెట్టడమా? పెట్టకపోవడమా? అనేది పూర్తిగా రజినీకాంత్ సొంత వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో నిందాస్తుతులకు అవకాశం లేదు. అలాంటి పనిచేయడం అత్యుత్సాహం, తప్పు అవుతుంది. అయితే అదే సమయంలో.. రాష్ట్ర ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకానికి ఆయన ఏ విధంగా జవాబు చెప్పబోతున్నారు. కేవలం క్షమాపణ సరిపోతుందా? వారు పెట్టుకున్న ఆశలను ఆయన ఏ విధంగా తీర్చబోతున్నారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయాలు.
గతంలో ఓ సందర్భంలో జయలలితతో విభేదాలు వచ్చినప్పుడు.. అప్పటి ఎన్నికల్లో డీఎంకే కు ఓటు వేయాల్సిందిగా రజినీకాంత్ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఆయనే రాజకీయాల్లోకి రావాలనుకుని- మానుకున్నారు. మరి.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాజకీయంగా ఒక పార్టీకి మద్దతిచ్చేలా ఆయన ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఆయన స్వయంగా ప్రజలకోసం పార్టీ పెట్టలేని స్థితిలో ఉండొచ్చు. ఆయన పార్టీ పెట్టాల్సిందే అనే, డిమాండ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కాకపోతే.. ప్రజల్లో ఆశ రేకెత్తించిన సూపర్ స్టార్ గా .. ఆయన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ఉందని మాత్రం అనగలం. ఎందుకంటే.. ప్రజలకు మంచి జరగాలంటే.. ఎవ్వరి ద్వారా అది మెరుగ్గా సాధ్యమవుతుందో.. రజినీకాంత్.. కనీసం చెబితే.. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆయనకున్న శ్రద్ధకు నిదర్శనం అవుతుంది. తానుగా పార్టీ పెట్టలేని పరిస్థితుల్లో ఒక పార్టీని సమర్థించి, ఇతరులతో తానెందుకు వైరం కొని తెచ్చుకోవాలనే మధ్యస్త మార్గాన్ని రజినీకాంత్ అనుసరిస్తే గనుక.. ఖచ్చితంగా ఆయన ప్రజల ఆశలను వమ్ము చేసినట్లే.

దేవుడి హెచ్చరిక
రాజకీయ పార్టీకి సంబంధించి ఇటీవలి సమావేశం తర్వాత.. అన్నాత్త షూటింగ్ కు రజినీ హైదరాబాదు వచ్చారు. ఇక్కడ కరోనా పరీక్షలు చేయించుకుని, హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. హైబీపీ, బీపీలో హెచ్చుతగ్గులు ఆయనను ఆస్పత్రి పాల్జేశాయి. మూడురోజుల తర్వాత.. ఇంటికి వచ్చారు. రెండు రోజులు విరామం తీసుకున్నారు. ఈలోగా ఆయన కుమార్తెలు ఇద్దరూ.. అల్లుడు ధనుష్ వీరందరూ కూడా.. రాజకీయ పార్టీ ఆలోచన వద్దనే మాట చెబుతున్నట్లుగా బాగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే పార్టీ పెట్టడం లేదని అనేశారు.
అయితే బీపీ హెచ్చుతగ్గుల ద్వారా ఆస్పత్రి పాల్జేసిన, రాజకీయ పార్టీ విషయంలో పునరాలోచన కలిగించిన పరిణామాలను రజినీకాంత్.. దేవుడి హెచ్చరికగా అభివర్ణించడం చిత్రంగా ఉంది. రజినీ తిరుగులేని ఆధ్యాత్మ వాది. ఆ విషయం నిస్సంశయం. కాలినడకన, అత్యంత సాధారణ వ్యక్తిలాగా ఆయన హిమాలయాల్లోని తన గురువును దర్శించడానికి వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఆయనలో ఎక్కువ. అదే సమయంలో రాజకీయ పార్టీ ప్రకటన చేసినప్పుడు కూడా.. ఆధ్యాత్మకి రాజకీయాలను తీసుకువస్తానని ఆయన ఒక కొత్త మాట కూడా చెప్పారు. ఇదంతా రజినీలోని ఆధ్యాత్మకి జీవికి ప్రతీక.
అయితే పార్టీ పెట్టడం మానుకుని… దానిని దేవుడి హెచ్చరికగా అభివర్ణించడం ఏంటో అర్థం కావడం లేదు. రజినీకి మూత్ర పిండాల సమస్య ఉన్న సంగతి ఆయనకు ఇన్నాళ్లు తెలియదా? కొన్ని వారాల కిందట.. రజినీ పేరుతో పార్టీ పెట్టడం లేదనే ఒక లేఖ విడుదలైంది. అనంతరం ఆయన ప్రెస్ రిలీజ్ ఇస్తూ.. లేఖలోని అనారోగ్యం సంగతులు నిజమే గానీ.. లేఖ తను రాసింది కాదని వివరణ ఇచ్చారు. ఆయన అనారోగ్యం ఎప్పటినుంచో ఉంది. జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన బీపీ హెచ్చుతగ్గులు హఠాత్తుగా పార్టీ పెట్టవద్దనే దేవుడి హెచ్చరికగా ఆయన ఎలా భావిస్తున్నారు. పార్టీకే హెచ్చరిక అని ఎందుకు అనుకోవాలి. సినీ హీరోగా, అత్యంత క్లిష్టమైన పనిలో ఉండే సందర్భాలనుంచి కూడా దూరం ఉండాలనేందుకు దేవుడి హెచ్చరికగా ఎందుకు పరిగణించకూడదు. ఈ దేవుడి హెచ్చరిక సంకేతాలను.. సినిమా నటుడిగా జీవితానికి అన్వయింపజేసుకుని.. రజినీకాంత్ ఎందుకు సినీ రంగం నుంచి రటైర్మెంట్ ప్రకటించకూడదు. అన్నాత్త తన చివరి చిత్రం అని.. తర్వాత ఇక చేయనని ఎందుకు అనలేకపోతున్నారు.
ఇదంతా కమర్షియల్ యుగం. సంపాదన కోట్లలో ఉండే.. సినీ నటుడి ప్రస్థానాన్ని ఆయన వదులుకోలేరు. దేవుడు స్వయంగా వచ్చి హెచ్చరించినా సరే.. రజినీ దానిని వదులుకుంటారని అనుకోలేం. రజినీ- సూపర్ స్టార్ గా ఉండడం వలన వచ్చే ఆదాయం, లాభాలు ఇతర వ్యవహారాల మీద బతుకుతున్న వర్గాలు ఆయనను రిటైర్ కానివ్వవు. సినిమా నటుడిగా విరమించుకుంటే ఆయన కోట్లు కోల్పోతారు. అది ఇష్టం ఉండకపోవచ్చు. రాజకీయం అలా కాదు. ఆయన చేతినుంచి కూడా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవగా భావిస్తూ ఖర్చు పెడితే.. ఆ పెట్టుబడి తిరిగొస్తుందో లేదో కూడా కష్టం.
ఇలాంటి నేపథ్యంలో బీపీ రూపంలో దేవుడు పంపిన హెచ్చరికల్ని.. కేవలం రాజకీయాలకు మాత్రమే పరిగణించాలని.. సినీ నట జీవితానికి ఆ హెచ్చరికలకు సంబంధం లేదని… రజినీకాంత్ భావించి ఉండవచ్చు. లేదా.. అలాంటి ఆలోచనలను.. ఆయన చుట్టూ ఉండే, ఆయనను ప్రభావితం చేయగల కోటరీ.. బలంగా ఆయన బుర్రలోకి ఎక్కించి ఉండవచ్చు.
ఏదైతేనేం.. ‘రజినీకాంత్- రాజకీయ పార్టీ’ అనే ట్యాగ్ లైన్ చుట్టూ పుకార్లకు ఊహాగానాలకు ఆశలకు నమ్మకాలకు శాశ్వతంగా తెరపడిపోయింది. ఆయనే స్వయంగా తెరదించి, శుభం కార్డు కాకుండా, ‘ది ఎండ్’ కార్డు వేసేశారు! రజినీకాంత్ ఒక వ్యక్తి కాదు శక్తి అని ముందు చెప్పుకున్నాం. ఆ మాట తప్పు. దాన్ని దిద్దుకోవాలి. రజినీకాంత్ ఒక శక్తి కాదు.. వ్యక్తి. ఆయన ఒక సినీనటుడు మాత్రమే. ఆ రంగంలో ఎన్నో ఉన్నతులను రుచిచూసిన సూపర్ స్టార్. అంతే. మహా అయితే.. నిస్సంశయమైన ఆధ్యాత్మిక చింతనశీలి. అంతే తప్ప ఆయన నాయకుడు కాదు. కాబోడు. పార్టీ అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. ఆయన పార్టీ ఆయన ఇష్టం. అంతిమంగా ఈ పరిణామాలు తెలియజెబుతున్న సత్యం ఇది!
.. సురేష్ పిళ్లె
[email protected]