శ్రీ వారి దర్శనాన్ని సామాన్యులకు దూరం చేసే ప్రయత్నం ..!
శ్రీవారిని సామాన్యులకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీటీడీ తీసుకుంటున్న ప్రతిఒక్క నిర్ణయం హిందూ బంధువులకు, సాధు, సంతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల దేవస్థానం ప్రాభవం తగ్గిచే ప్రయత్నంగా చర్యలు సాగుతున్నాయన్నది సుస్పష్టం! తాజాగా స్వామి వారి ఉదయాస్తమాన సేవా టికెట్లకు టీటీడీ ధరలు నిర్ణయించడంపై విమర్శలు వెల్లవెత్తున్నాయి. స్వామీజీలు, భక్తులు ఈ నిర్ణయాన్ని ముక్తకఠంతో ఖండిస్తున్నారు. భక్తులకు ఉచితంగా అందించాల్సిన సేవలకు రూ. కోటిన్నర ధర నిర్ణయించడం ఏమాత్రం సరికాదని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనాలోచిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి..!
టీటీడీ చేస్తున్న అనేక అనాలోచిత నిర్ణయాలను వెనక్కితీసుకోవాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకుంటే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని శ్రీనివాసానంద సరస్వతీ హెచ్చరించారు. రాజకీయ దురుద్దేశాలతో తిరుమల నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని కిష్కింద హనుమ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ ఆరోపించారు. శ్రీవారి సేవా టికెట్లతో టీటీడీ వ్యాపారం చేయడం సరికాదని రాయలసీమ పోరాట సమితి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు కేటాయించి స్వామి సేవలో పేదలు పాల్గొనకుండా దూరం చేయడమేనని నవీన్ వాపోయ్యారు.
ఉదయాస్తమాన టికెట్ ధర కోటినర..!
తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన ఒక్క టిక్కెట్ ధర కోటిన్నరగా నిర్ణయించారు. ఈ టికెట్ తో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగ్గురు భక్తులు పాల్గొని అవకాశం ఉంటుంది. ఇలా ఏడాదిలో ఒకసారి కల్పిస్తూ .. 25 ఏళ్లుపాటు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 600 కోట్ల పైగా ఆదాయాన్ని రాబట్టాలని ప్రయత్నిస్తోంది. దీనిపై ఈ నెల 23 నుంచి టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనున్నది.