తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సహజశైలికి భిన్నంగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎంపీ స్థానానికి పనబాక లక్ష్మి పేరును అందరికంటె ముందుగా ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా పోటీచేసిన నేపథ్యం, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం వెరసి.. తెలుగుదేశానికి ఎడ్వాంటేజీ అవుతాయనే ఉద్దేశంతో ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. అయితే.. పనబాక లక్ష్మి తిరుపతిలో పోటీచేయడానికి సుముఖంగా లేరంటూ ఒక ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు హోరెత్తించారు. కథనాలు వెల్లువయ్యాయి. ఇదంతా కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తెలుగుదేశం శ్రేణులను అయోమయంలో పడేయడానికి జరుగుతున్న కుట్రగా ప్రజలు గుర్తించారు.
ఈలోగా కుట్రపూరితంగా జరుగుతున్న ఇలాంటి ప్రచారం వల్ల జరిగే నష్టమేమిటో పనబాక లక్ష్మి పసిగట్టారు. ఆ నేపథ్యంలోనే ఆమె ప్రత్యేకంగా బుధవారం నాడు వచ్చి చంద్రబాబునాయుడుతో భేటీ అయినట్లు సమాచారం. ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని, తాను పోటీకి సుముఖంగా ఉన్నానని, తొందర్లోనే ప్రచారం ప్రారంభించనున్నానని ఆమె చంద్రబాబుతో చెప్పి వెళ్లారు.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?
ఇలాంటి దుష్ప్రచారాల కుట్రలు ఎందుకు?
తెలుగుదేశం పోటీకి దిగుతుండగా.. అసలు కేండిడేట్ కు ఆసక్తి లేదంటూ ఎందుకు ప్రచారాలు జరిగాయనేది ఆసక్తికరమైన అంశం. స్థానిక ఎన్నికలు నిర్వహించడానికే భయపడే రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజల్లో నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడి ఉన్నదని అధికార పార్టీ గుర్తించిందని అంటున్నారు. అలాంటి సమయంలో.. తెలుగుదేశం ఇప్పటినుంచి యాక్టివ్ అయి.. ప్రచారంలో దూసుకెళ్లిపోతే.. ఎన్నికల మీద ప్రభావం చూపగలరనే భయంతోనే.. ప్రజల్ని , ప్రధానంగా పార్టీ కేడర్ ని అయోమయంలోకి నెట్టడానికి ఇలాంటి ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దానికి విరుగుడు కూడా పూర్తయింది.
గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనబాక లక్ష్మి పోటీలో ఉన్నారు. వైసీపీ తరఫున గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నికవచ్చింది. అయితే వారి కుటుంబానికి కాకుండా.. కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కొత్త వ్యక్తి ప్రజల్లోకి వెళ్లి అనుకూలతను సృష్టించుకునేలోగా.. తెదేపా ప్రచారంలో దూసుకెళ్లకుండా.. బ్రేకులు వేయడానికే ఇలాంటి ప్రచారం జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ-జనసేన కూటమి ఇక్కడ పోటీచేయడానికి సిద్ధమౌతోంది. ఏ పార్టీ తరఫున అభ్యర్థి బరిలో ఉంటారో తెలియదు. అయితే గతంలో ఎన్నడో ఒకసారి గెలిచిన చరిత్ర ఉన్నదని బీజేపీ మేమే పోటీచేస్తాం అంటోంది. అయితే అప్పుడు తెలుగుదేశం మద్దతుతోనే గెలవగలిగామనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. ఇప్పుడు అనివార్యమైన త్రిముఖ పోటీకి వారు కారణం అవుతున్నారు.
సోమిరెడ్డికి బాధ్యతలు
తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక బాధ్యతను చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చేతిలో పెట్టినట్టుగా సమాచారం. పనబాక లక్ష్మితో పాటు చంద్రబాబును కలిసిన వారిలో ఆయన కూడా ఉన్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేదిశగా వారు కదులుతున్నారు.
Also Read ;- దేవుని భూములు దోచుకునేందుకు వైసీపీ కుట్ర : అనిత