కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఏపీలో జనసేన కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కరోనా రోగులకు జనసైనికులు పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసి ఔరా అనిపించారు. సేవా కార్యక్రమాలు మాత్రం నిరంతరం కొనసాగించారు. కానీ అధికారికంగా జనసేనాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్యంగా గెలవడంతో జనసేనలోనూ ఉత్సాహం నింపింది. బీజేపీ అభ్యర్థి గెలిస్తే జనసేనకు ఎందుకు ఉత్సాహం అనుకుంటున్నారా?
ఏపీలో జనసేన, బీజేపీ జట్టుకట్టాయి కదా? ఇక నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా రెండు పార్టీలు చర్చించుకుని ఏదో ఒక పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థిని నిలుపుతారు. గెలుపుకోసం రెండు పార్టీల నేతలు కృషి చేస్తారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం అయింది. ఇప్పుడు అన్ని పార్టీ నేతల ఫోకస్ తిరుపతి పార్లమెంటుకు జరిగబోయే ఉప ఎన్నికపైనే ఉంది.
తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థిని నిలుపుతుందా?
తిరుపతిలో బీజేపీ కన్నా జనసేనకు మంచి పట్టుంది. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా చిరంజీవి సొంత నియోజకవర్గంలో జనం హ్యాండిచ్చినా, తిరుపతిలో అభిమానులు గెలిపించారు. ఇక తమ్ముడు స్థాపించిన జనసేనకు కూడా తిరుపతిలో మంచి ఓటింగ్ ఉంది. అక్కడ ఉప ఎన్నిక జరిగితే బీజేపీ కన్నా, జనసేన పార్టీ అభ్యర్థిని నిలపడమే కరెక్ట్. అందుకే జనసేనాని మంగళగిరిలో 17వ తేదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమాకు 45రోజుల సింగిల్ షెడ్యూల్ షూటింగ్ కు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ 17 తేదీ షూటింగ్ రద్దు చేసుకున్నారు. అత్యవసరంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే తిరుపతి అభ్యర్థిని చూచాయగా ఖరారు చేసే అవకాశం ఉంది.
తిరుపతి అభ్యర్థి కోసం జనసేన అధినేత కసరత్తు
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లోనూ జనసేనకు మంచి అభిమానులు ఉన్నారు. ఓటింగ్ శాతం కూడా ఆ ప్రాంతంలో 18 శాతం దాకా ఉందని ఓ అంచనా. బీజేపీకి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓట్లు 2 శాతం మించవు. ఎలా చూసుకున్నా జనసేన పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపడం శ్రేయస్కరమని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా చూసుకున్నా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 21 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం రెండు లక్షలు మాత్రమే. జనసేన 7 శాతం ఓట్లతో ఏపీలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. తిరుపతిలో కూడా బీజేపీ అండతో జనసేన పోటీలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి దగ్గర కావాలని చూస్తున్న టీడీపీ అధినేత కూడా జనసేన అభ్యర్థి పోటీ చేస్తే, తిరుపతిలో టీడీపీ అభ్యర్థిని నిలపకుండా వారికి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే తిరుపతిలో జనసేన బలమైన అభ్యర్థిని దింపితే, టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటే, వైసీపీకి తిరుపతి ఎన్నికలు టఫ్ గా మారతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.
Also Read ;- జనసేనను నమ్ముకుని.. బరిలో తొడకొడుతున్న బీజేపీ!