ధరణి పోర్టల్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. పోర్టల్లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్పై విచారణ చేపడుతూ వ్యవసాయేతర(నాన్ అగ్రికల్చర్) ఆస్తుల వివరాలను ఆ పోర్టల్లో నమోదు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
రెవెన్యూ విభాగంలో సరికొత్త సంస్కరణలను తెరలేపుతూ ధరణి పోర్టల్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకంగా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు వివరాలను సేకరించి పోర్టల్లో పొందుపరిచారు కూడా. అయితే ధరణి పోర్టల్లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగానే ఆ పోర్టల్లో వ్యవసాయేతర భూములు, ఆస్తుల వివరాలను నమోదు చేయొద్దంటూ ఆదేశాలు ఇస్తూ మంగళవారం హైకోర్టు స్టే విధించింది.
నిబంధనలు పాటిస్తున్నారా..
ధరణి యాప్లో భద్రతాపరమైన అంశాలు, నిబంధనలు పాటించకుండా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ వివరాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. నిబంధనలు పాటించకుంటే భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నది. ఇప్పటికే ధరణి పోర్టల్ను పోలిన మరో నాలుగు యాప్లు గూగుల్ ప్లై స్టోర్లో ఉన్నాయని, దీంతో అసలు ధరణి పోర్టల్ ఏదో తెలుసుకోవడం ప్రజలకు సమస్యగా మారుతుందని పేర్కొన్నది. వ్యవసాయేతర భూములకు సంబంధించిన ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదు విషయంలో ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దని సూచించింది. అసలు ఏ చట్ట ప్రకారం కులం, ఆదాయం వివరాలను సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
వాటి ప్రస్తావన ఎక్కడ?..
నూతన రెవెన్యూ చట్టం అగ్రికల్చర్ భూములకు సంబంధించింది మాత్రమేనని కొత్త రెవెన్యూ చట్టంలో నాన్ అగ్రికల్చర్ భూముల ప్రస్తావన ఎక్కడ ఉందని ప్రశ్నించింది. డేటా భద్రతకు సంబంధించి నూతన రెవెన్యూ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని న్యాయస్థానం పేర్కొన్నది. డేటా దుర్వనియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపింది. హైకోర్టు చేసి వ్యాఖ్యలకు అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువును అడ్వకేట్ జనరల్ కోరారు. దాంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.