నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018 లో జరిగిన అమృత, ప్రణయ్ ల పరువు హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావును అరెస్ట్ చేయడం.. కొద్ది రోజులకు ఆయన ఆత్మ హత్యచేసుకోవడం అందరికీ తెలిసినవే. అయితే ఈ విషాదాంత ప్రేమకథను వివాదాల దర్శకుడు రామ్ గోపాల వర్మ ‘మరర్డ్’ పేరుతో సినిమాగా తెరకెక్కించారు. ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.
అయితే తన ప్రేమకథను వర్మ సినిమాగా తీయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అమృత. అలాగే ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్గొండ కోర్ట్ ను ఆశ్రయించగా స్టే విధించింది. అయితే తమ సినిమాకి, అమృత, ప్రణయ్ ల ప్రేమకథకు ఎలాంటి సంబంధం లేదని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో మర్డర్ మూవీ విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సినిమాలో ఎక్కడా కూడా ప్రణయ్, అమృతల ఫోటోలు, వీడియోలు వాడకూడదని కోర్ట్ షరతు విధించింది. దాంతో ప్రణయ్ , అమృత ఫోటోలు వాడబోమని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్.