మావోయిస్టుల కోసం తెలంగాణ పోలీసులు తమ గాలింపును ముమ్మరం చేశారు. ఛత్తీస్ ఘడ్ నుంచి వరంగల్, ఖమ్మం అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్సీ వర్గాలకు సమాచారం అందింది. దీంతో వారి కోసం వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు అదిలాబాద్ జిల్లాలోను పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల భద్రాది, మానుకోట సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం నాడు మావోయిస్టులు, పోలీసులు ఒకరికొకరు తారసపడ్డారని, దీంతో ఎదురుకాల్పులు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో దామోదర్ దళానికి చెందిన యాక్షన్ టీం సభ్యుడు మరణించాడు. అలాగే రెండు రోజుల క్రితం జరిగిన మరో సంఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. దీంతో అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లుగా పక్కా సమాచారం ఉంది.
ములుగు, భద్రాద్రి, మానుకోట అడవుల్లో మావోయిస్టులు ఎక్కువ సమావేశాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ గాలింపు తీవ్రం చేయాలని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, వాటికి అనుగుణంగానే కూంబింగ్ చేస్తున్నారని అంటున్నారు.
మంత్రులే టార్గెట్…
తెలంగాణలో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ఏదో ఒక సంఘటనకు పాల్పడతారనే అనుమానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కొందరు మంత్రులు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు వారిని హెచ్చరించారు. గన్ మెన్ లు లేకుండా బయటకు రావద్దని, కొత్త వారెవరైనా వస్తే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు చెబుతున్నారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి లొంగుబాటు వార్తలు రావడం, అవి అబద్దాలంటూ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. గణపతి లొంగుబాటు వార్త పోలీసుల కట్టుకథే అని నిరూపించేందుకు, తాము బలహీనపడలేదని చాటుకునేందుకు మావోయిస్టులు ఏదో ఒకటి చేస్తారని అంటున్నారు. దీని కారణంగానే మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారన్నది పోలీసుల అంచనా.
ఎలాంటి సంఘటన జరగకుండా ముందే నివారణ చర్యలు చేపట్టాలని, అందుకే తెలంగాణలో కూంబింగ్ ముమ్మరం చేశారని అంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి తెలంగాణలో ప్రవేశించి అక్కడి నుంచి నగరాలకు విస్తరిస్తారని చెబుతున్నారు. ఇది అడ్డుకోవడం కోసం ప్రత్యేక దళాలతో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారని సమాచారం.
ప్రజా ప్రతినిధులూ జాగ్రత్త..
మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా జాగ్రత్తలు పాటించాలని, మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు అధికార పార్టీకి చెందిన వారినే కాకుండా ప్రతిపక్షాలకు చెందిన వారిని కూడా టార్గెట్ చేస్తారని పోలీసులు ప్రజాప్రతినిధులకు సమాచారం పంపించారు. ఎక్కడికి వెళ్లినా స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మళ్లీ తెలంగాణలో పాత రోజులు వస్తాయా అని వివిధ జిల్లాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.