జగన్ జమానాలో నేరస్థులు కూడ నిర్భయంగా ఆ సమీప ప్రాంతాల్లో తిరుగుతూ జల్సాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ నెల 19న రాత్రి ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆ మరుసటి రోజు 20వ తేదీ ఉదయం దగ్గరలోని ఉండవల్లి బార్లో కుషీ చేసుకున్నారు. నిషా తలకెక్కిన నిందితులు వారు చేసిన ఈ ఘన కార్యం గురించి స్నేహితులకు గొప్పగా వివరించారు. వారి కర్మకాలి ఈ సంభాషణ అంతా పక్క టేబుల్లో ఉన్న పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి చెవిలో పడింది. అప్పటికే ఈ అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో విషయాన్ని పసిగట్టిన ఆ ఉద్యోగి పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే బార్ వద్దకు వెళ్లగా వారు అప్పటికే అక్కడ నుంచి వెళ్ళి పోయారు.
నిందితులను పట్టించిన ఫోన్..
ఆ సమయంలో నిందితులు అక్కడి నుంచి జారుకున్నా వారు తాకట్టు పెట్టిన ఫోన్ వారిని పట్టించింది. బాధితుల వద్ద గుంజకున్న ఫోన్ను నిందితులు తాడేపల్లికి చెందిన తాపీమేస్త్రి భార్య వద్ద తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆమె ఆ ఫోన్ను ఆన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె నుంచి సేకరించిన సమాచారంతో నిందితులను గుర్తించారు. అక్కడి రైల్వే వంతెన వద్ద తిరిగే వారే నిందితులని తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
నిర్భయంగా తిరిగారంటే..
సీఎం క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలో అత్యాచారం ఘటనకు పాల్పడిన నిందితులు ఆ ప్రాంతంలోనే తిరిగారంటే శాంతి భద్రతల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ఎలాంటి నేరాలు చేయకున్నా తమకు నచ్చని వారిని కటకటాల పాలు చేస్తున్న పోలీసులు ఈ నిందితులను పట్టుకోవడంలో మాత్రం వారి ప్రతిభను చాటుకోలేక పోయారు. మద్యం మత్తులో వారు వెళ్లగక్కిన విషయాలే వారిని పట్టించాయి.
Must Read ;- షిట్.. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్!











