కరోనా సెకండ్ వేవ్ దేశంపై ఉప్పెనలా విరుచుకుపడింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. సరైన ఆక్సిజన్ నిల్వలు లేక బాధితులు సిలిండర్లతో సహా వెళ్లి చికిత్స పొందిన సందర్భాలున్నాయి. ఢిల్లీతో పాటు ఎన్నో రాష్ట్రాలు ఇబ్బందులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించుకున్నారు. 700 టన్నుల ఆక్సిజన్ కావాలని సుప్రీం కోర్టుకు సైతం వెళ్లడంతో.. ఆ మొత్తం ఇచ్చేసింది కేంద్రం. ఫలితంగా కొంతవరకు మరణాల సంఖ్య తగ్గింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి.. ఆక్సిజన్ వాడుకుందనే తీవ్ర విమర్శలొచ్చాయి.
తేల్చి చెప్పిన సుప్రీం
ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ వాడుకుందనే ఆరోపణలపై సుప్రీం కోర్టు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలోని ఆక్సిజన్ ఆడిట్ ప్యానెల్ ను నియమించింది. శుక్రవారం మధ్యంతర నివేదికను విడుదల చేసింది. సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీకి 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజనే అవసరం ఉంది. అయితే అంతకుమించి నాలుగు రెట్లు ఎక్కువగా కేజ్రీ సర్కారు తీసుకుందని స్పష్టం చేసింది. 1,140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పొందిందని తెలిపింది. ఢిల్లీకి ఎక్కువ ఆక్సిజన్ నిల్వలను కేటాయించడంతో.. 12 రాష్ట్రాలకు ఆక్సిజన్ అందలేదని తెలిపింది. తప్పుడు లెక్కలు చూపి ఎక్కువ ఆక్సిజన్ ను తీసుకుందని పేర్కొంది.
ముఖ్యమైన సూచనలు
ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ వాడటంతో.. ఈ విషయాన్ని కమిటీ సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీలా.. ఇతర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ డిమాండ్ చేసే అవకాశాలు ఉండటంతో.. ముఖ్యమైన సూచనలు చేసింది. ఢిల్లీ లాంటి పెద్ద నగరాలు కనీసం 50 శాతం ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, కేంద్రంపై ఆధార పడకుండా 100 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
Must Read ;-వృథా చేస్తే కోతే.. టీకాల పంపిణీకి కేంద్రం కొత్త మార్గదర్శకాలు