నర హంతక ఉగ్రవాద ముఠా తాలిబాన్ల వశం అయిపోయిన ఆఫ్ఘనిస్తాన్ లో భారత మూలాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఉగ్రవాద దాడులతో అతలాకుతలం అయిపోయిన ఆఫ్ఘన్ కు అగ్రరాజ్యం అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. తన మిలిటరీ బలగాలను రంగంలోకి దించి తాలిబాన్లను తరిమికొట్టింది. మిలిటరీ సాయంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లోనూ అమెరికా పెద్దన్న మాదిరే వ్యవహరించిందని చెప్పక తప్పదు. అయితే ఆ పెద్దన్నకు చేదోడువాదోడుగా నిలిచిన దేశాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి. ఆ జాబితాలో మన దేశం భారత్ కూడా కీలక భూమిక పోషించింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో ఆ దేశ చట్ట సభ పార్లమెంటు భవనం భారత నిధులతో కట్టించినదే. ఈ విషయం చాలా మందికి తెలియదనే చెప్పాలి. భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని స్వయంగా ప్రారంభించారు. 2015 డిసెంబర్ 25న ఈ ప్రారంభోత్సవం జరిగింది.
ఆ రూ.710 కోట్లు భారత్ వే
ఉగ్రవాదుల దాడులతో కకావికలమైన ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో పలు దేశాలతో పాటు భారత్ కూడా తన బాధ్యతను గుర్తించింది. నిత్యం ఉగ్రవాదుల దాడులతో మనం కూడా చాలానే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ఉగ్ర దాడులతో ఎంతటి నష్టం జరుగుతుందో? ఆయా దేశాలు ఏ మేర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతాయో స్పష్టంగా తెలిసిన నేపథ్యంలోనే ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి భారత్ ముందుకు కదిలింది. అందులో భాగంగా ఆ దేశ చట్టాలు రూపొందే పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తామని భారత్ చెప్పింది. అనుకున్నట్లుగానే 85 ఎకరాల్లో నిర్మితం కానున్న ఆ దేశ పార్లమెంటు భవనం కోసం భారత్ ఏకంగా రూ.710 కోట్లను వెచ్చించింది. నిధులు ఇవ్వడంతో పాటుగా భవన నిర్మాణాన్ని కూడా నిత్యం పర్యవేక్షించింది. 2015 నాటికి ఆ భవన నిర్మాణం పూర్తి కాగా.. భారత సాయాన్ని స్మరించుకునే నిమిత్తం ఆ దేశ ప్రభుత్వ తమ పార్లమెంటు భవనంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరుతో అటల్ బ్లాక్ అంటూ ఓ ప్రత్యేక సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. అటల్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2015 డిసెంబర్ 25న భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఆఫ్ఘన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు.
ఇప్పుడు తాలిబాన్ల చేతిలో..
ఆఫ్ఘన్ ను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో తొలుత అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకున్న ఉగ్రవాదులు.. ఆ తర్వాత నేరుగా పార్లమెంటు భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పార్లమెంటు భవనం తమ స్వాధీనంలోకి వచ్చినంతనే.. తాలిబాన్ ఉగ్రవాదులు పార్లమెంటు భవనంలో తమదైన శైలి వికృత చేష్టలకు పాల్పడ్డారు. నేరుగా స్పీకర్ కుర్చీలో ఓ ఉగ్రవాది కూర్చోగా మిగిలిన ఉగ్రవాదులు పార్లమెంటు భవనం దద్దరిల్లేలా నినాదాలు చేశారు. పార్లమెంటు సభ్యులు కూర్చునే సీట్లలో ఉగ్రవాదులు ఆసీనులై తమ వికృత చేష్టలను ప్రదర్శించారు. మొత్తంగా ఆప్ఘన్ లో భారత్ కట్టించిన పార్లమెంటు భవనం ఇప్పుడు తాలిబాన్ల వశం అయిపోయింది.











