ఏపీలో ఒక రోజు పాటు నిర్వహించిన అసెంబ్లీ,మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.ఒక రోజు సమావేశాల్లో జగన్ సర్కార్ 2021 – 22 బడ్జెట్ను ప్రవేశపెట్టింది.ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్సు ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగించారు.తరవాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,మండలిలో మంత్రి ధర్మాన కృష్ణదాసు బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021 – 22 సంవత్సరానికి రూ.2,29,779 కోట్ల బడ్జెట్ను ప్రవేశ పెట్టారు.ఏపీ చరిత్రలో తొలిసారి జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.ఈ వార్షిక బడ్జెట్లో రూ.47,283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. చిన్న పిల్లలకు రూ.16,748 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు.
నవరత్నాలకే కేటాయింపులన్నీ..
బడ్జెట్లో నవరత్నాలకు పెద్దపీట వేశారని చెప్పవచ్చు.బీసీ సబ్ ప్లాన్కు రూ.28 వేల కోట్లు,కాపుల సంక్షేమానికి రూ.3,306 కోట్లు,ఎస్సీ సబ్ ప్లాన్కు రూ.17,237,ఎస్టీ సబ్ ప్లాన్కు రూ.6,131, మైనార్టీ ప్లాన్కు రూ.3,840 కోట్లు కేటాయించారు. ఇక పిల్లల కోసం రూ.16,748 కోట్లు,మహిళాభివృద్ధికి రూ.47,283,వ్యవసాయానికి రూ.11,210 కోట్లు, విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు, వైద్య,ఆరోగ్య రంగాలకు రూ.13,840 కోట్లు,వైఎస్సార్ ఫించన్లకు రూ.17 వేల కోట్లు, వైఎస్పార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు,రైతుల పథకాలకు రూ. 11,210 కోట్లు, విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు కేటాయించారు.బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసినా,ఆదాయ మార్గాలను మాత్రం ప్రభుత్వం వివరించకపోవడం విశేషం.
రఘురామరాజుపై అనుచిత వ్యాఖ్యలు..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుపై పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగు రమేష్ అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం రఘురామరాజును తిట్టిపోశారు.పార్టీ గుర్తు,జగన్ ఫోటోతో గెలిచిన రఘురామరాజు, రాజీనామా చేస్తే వార్డు మెంబరుగా కూడా గెలవరని జోగి రమేష్ విమర్శలు గుప్పించారు.ప్రచురించడానికి కూడా సాధ్యంకాని అనుచిత వ్యాఖ్యలు చేసి తరవాత రికార్డుల నుంచి తొలగించాలంటూ జోగి రమేష్ స్పీకర్ను కోరారు.దీనిపై సీఎం జగన్ జోగి రమేష్ను అభినందించారు.
ప్రాణం విలువ నాకు బాగా తెలుసు
తనకు ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీ పథకానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గుర్తు చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 95 శాతం అమలు చేయడంతో పాటు,ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టినట్టు జగన్ తెలిపారు.తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరవాత, ఆ బాధతో ఎంతో మంది చనిపోయారని,వారందరి ఇంటికి వెళ్లి పలకరించానని జగన్ చెప్పుకొచ్చారు.ప్రజల బాధలు తెలుసుకాబట్టే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు. దేశంలో నెలకు 7కోట్ల టీకాలు మాత్రమే తయారవుతున్నాయని,అందరికీ టీకాలు వేసే వరకు కరోనాతో సహజీవనం తప్పదన్నారు.కరోనా టీకాలు కొనుగోలు చేసేందుకు దేశంలోనే గ్లోబల్ టెండర్లు పిలిచిన మొదటి రాష్ట్రం ఏపీయేనని సీఎం జగన్ గుర్తు చేశారు.కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.రాబోయే కొద్ది రోజుల్లోనే 18500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేస్తామని అన్నారు.కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని,తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల కష్టాలు తెలుసని చంద్రబాబునాయుడుపై పరోక్షంగా చురకలు వేశారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా,సంక్షేమ పథకాల నగదు బదిలీ చేసేందుకు క్యాలండర్ తయారు చేసి చెప్పిన తారీఖున లబ్దిదారుల ఖాతాలో డబ్బు వేస్తున్నామని సీఎం గుర్తు చేశారు.సీఎం జగన్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
Must Read ;- చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాలి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దేవినేని ట్వీట్











