కొత్త రెవెన్యూ చట్టం అమలు కోసం రెవెన్యూ విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేపట్టింది. రెవెన్యూ శాఖలో ఉన్నలొసుగులను ఆసరాగా చేసుకొని అవినీతికి పాల్పడకుండా, పారదర్శకతను తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అయితే మరోసారి అసెంబ్లీ సమావేశం కానున్నది. ఈనెల 12, 13వ తేదీలలో శాసనసభ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై శుక్రవారం ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన పలు అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో..
త్వరలో జిహెచ్ఎంసి కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన నేపథ్యంలో ఆస్తుల వివరాలు సేకరణ జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఏమైనా సవరణలు, మార్పులు, చేర్పులు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ శాసనసభ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ నెలలో ముగిసిన విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది, జర్నలిస్టులు, పోలీసు సిబ్బందికి కరోనా సోకిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అప్పడు నిరవవధిక వాయిదా వేశారు.
ఆ సమావేశాల్లో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అలాగే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి రెవెన్యూ శాఖలో సంస్కరణలకు తెరలేపింది. మొత్తం 12 బిల్లులు పాసైతే.. అందులో అసెంబ్లీలో 8 బిల్లులు, మండలిలో 4 బిల్లలు పాస్ అయ్యాయి. కాగా వచ్చే సోమ, మంగళవారం రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే అంశంపై శుక్రవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.