ఎప్పటి నుంచో జనం ఎదురు చూస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. దసరా పండుగకు ఒక రోజు తరువాత లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు. దీంతో పేదల ఇళ్లల్లో నిజమైన దసరా పండుగ వచ్చినట్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న ఇళ్లను ఈనెల 26వ తేదీన లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నగరంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తొలివిడతలో 1152 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నగరంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జియాగూడలో 840, గోడేకా కబర్లో 192, కట్టేల మండిలో 128 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
సోమవారం రోజు..
అయితే సోమవారం పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ శుక్రవారం పర్యవేక్షించారు. ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లపై తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు జియాగూడలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని, 10.30 గంటలకు గోషామహల్ నియోజకవర్గ పరిధిదలోని గోడేఖీ కబర్, 11 గంటలకు కట్టెల మండిలో నిర్మించిన ఇండ్లను ప్రారంభిస్తారు. పేద ప్రజల సొంతింటి కల త్వరలోనే నెరవేరబోతున్నదని ఆయన చెప్పారు.
ప్రతి ఏరియాలో బస్తీ దావఖాన..
లబ్దిదారులపై ఒక్క పైసా భారం లేకుండా ప్రభుత్వం పూర్తి ఖర్చులతో త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజి వంటి అన్ని రకాల సౌకర్యాలతో ఇండ్ల నిర్మాణం చేసినట్లు తలసాని చెప్పారు. పేద ప్రజలకు వైద్యసేవలు చేరువ చేసేందుకు ప్రతి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వద్ద ఒక బస్తీ దావఖాన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 26 వ తేదీ నాటికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇక హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇప్పటికే 80 శాతానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు కేటీఆర్ పేర్కొంటున్నారు. త్వరలోనే మిగతా ఇళ్లను కూడా పూర్తి చేసి పేదలకు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే డబుల్ ఇళ్లను పంపిణీ చేసే అంశం తెరపైకి వచ్చినట్లు పలువురు రాజకీయ పార్టీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.