అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న జో బైడెన్ టీంలో 20 మంది భారతీయ అమెరికన్లకు కీలకమైన పదవులు లభించాయి. 20 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కగా..అందులో 17మంది అధ్యక్ష భవనంలోనే కీలక పొజిషన్లలో ఉండనున్నారు. భారతీయ అమెరికన్ కమలా హారిస్ అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్న మొదటి మహిళగా రికార్డు సాధిస్తుండగా, మరో 19మంది బైడెన్ టీంలో ఉండనున్నారు. అందులోనూ 13మంది మహిళలు ఉన్నారు.
నీరా టాండన్ వైట్హౌజ్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కు డైరెక్టర్గా నియమితులు కాగా, కర్ణాటకకు చెందిన డాక్టర్ వివేక్ మూర్తిని యూఎస్ సర్జన్ జనరల్గా నామినేట్ చేశారు. ఇక వనితా గుప్తాకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అసోసియేట్ అటార్నీ జనరల్ పదవి దక్కగా, బైడెన్ భార్య జిల్ బైడెన్కు పాలసీ డైరెక్టర్గా మాలా అడిగా, సాంకేతిక సంచాలకులుగా గరిమా వర్మ, మీడియా కార్యదర్శిగా సబ్రినా సింగ్లను బైడెన్ నియమించారు. మరో మహిళ కశ్మీర్కు చెందిన ఐషా షా వైట్ హౌజ్ డిజిటల్ స్ట్రేటజీ ఆఫీస్లో పార్టనర్షిప్ మేనేజర్గా నియమితులయ్యారు. మరో మహిళ సమీరా ఫాజిలిను అమెరికా జాతీయ ఆర్థిక మండలి (నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ – NEC)లో డిప్యూటీ డైరెక్టర్గా నియమించారు. ఇదే కౌన్సెల్లో భరత్ రామ్మూర్తి కూడా డిప్యూటీ డైరెక్టర్గా ఉంటారు. హైదరాబాద్ మూలాలు ఉన్న వినయ్రెడ్డి డైరెక్టర్ స్పీచ్ రైటర్గా నియమితులు కాగా, గౌతమ్ రాఘవన్, , వేదాంత్ పటేల్లకూ కీలక బాధ్యతలు దక్కాయి. అమెరికా జాతీయ భద్రతా మండలిలోనూ ముగ్గురు ఇండో అమెరికన్లు ఉండనున్నారు. తరుణ్ చాబ్రా, సుమోనా గుహ, శాంతి కళాతిల్ ఇందులో కీలకమైన బాధ్యతలు చేపట్టనున్నారు.
హైదరాబాదీ మూలాలున్న వినయ్రెడ్డి..
హైదరాబాద్కి చెందిన వినయ్ రెడ్డి కుటుంబీకులు న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. మిమామీ యూనివర్సిటీ లా డిగ్రీ చేశారు.. ఓహియో యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ కీలకంగా వ్యవహరించారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి వినయ్రెడ్డి ఆయనతో కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు బైడెన్ క్యాంపెయిన్ స్టాఫ్గా పని చేసిన వినయ్ ఇప్పుడు రైటర్స్ టీమ్ హెడ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. వినయ్రెడ్డి గతంలో సెనెటర్ బ్రౌన్కి స్పీచ్ రైటర్గా, యునైటెడ్ స్టేట్స్ ఇన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ సీనియర్ స్పీచ్ రైటర్గా వ్యవహరించారు.
కశ్మీరీ.. ఫాజిలి..
కాగా అమెరికా NEC డిప్యూటీ డైరక్టర్ గా నియమితులైన ఫాజిలీ కాశ్మీర్కు చెందిన వారు. ఆమె తల్లిదండ్రులు యూసఫ్, రఫీకా న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ, యేల్ లా స్కూల్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. యేల్ లా విద్యా సంస్థలో ప్రొఫెసర్గా హౌజింగ్, చిరు వ్యాపారాలు, మైక్రో ఫైనాన్స్ తదితర విభాగాల్లో పని చేశారు. బరాక్ ఒబామా అనుచరురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో అట్లాంటా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అభివృద్ధి డైరెక్టర్గా, NEC సీనియర్ పాలసీ అడ్వైజర్గా విధులు నిర్వర్తించారు.
కర్ణాటక మూలాలున్న వివేక్ మూర్తి..
యూఎస్ సర్జన్ జనరల్గా నియమితులైన వివేక్ మూర్తి కర్ణాటక మూలాలున్న వ్యక్తి. వారిది మాండ్య జిల్లాకు చెందిన వైద్య కుటుంటం. కర్ణాటకలో ప్రముఖ రాజకీయవేత్తగా పేరున్న హెచ్ టీ నారాయణ్ శెట్టి మనుమడు. వివేక్ మూర్తి తండ్రి పేరు డా.వివేక్ హెచ్ మూర్తి. మైసూర్ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశాక వివేక్ హెచ్ మూర్తి లండన్ వెళ్లారు. కాగా వివేక్ మూర్తి లండన్లో జన్మించారు. తరువాత వారి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వివేక్ మూర్తి హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు. ఒబామాకు సన్నిహితుడిగా పేరుంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా సర్జన్ జనరల్గా పని చేశారు.
భరత్ రామ్మూర్తి..
ఈయన కూడా బెంగళూరు మూలాలున్న వ్యక్తిగా చెబుతారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి (ఎస్ఈసీ)లో డిప్యూటీ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ భరత్ రామమూర్తి ఎంపికయ్యారు. గతంలో సీఏఆర్ఈఎస్(కేర్స్) చట్టంపై వేసిన కాంగ్రెస్ పర్యవేక్షణ కమిషన్లోనూ రామ్మూర్తికి సభ్యత్వం లభించింది. మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సెనెట్ ఎలిజబెత్ వారెన్కు ఆర్థిక సలహాదారుగా, బ్యాంకింగ్ విధానాల రూపకర్తగా వ్యహరించారు.