టీవీ సీరియల్ నటి శ్రావణి జీవితం ముగిసే నాటికి మూడు ముక్కలాట కొనసాగింది. ఇప్పటిదాకా ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి నిజాలు నిగ్గు తేల్చారు. శ్రావణి చనిపోవడంతో ఎవరికి వారు ఇంకొకరిని దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియళ్లతో శ్రావణి పాపులర్ అయ్యింది.
ఈ కేసులో ప్రధానంగా దేవరాజ్రెడ్డి, సాయికృష్ణల పేర్లు వినిపించాయి. ఆ ఇద్దరూ కలిసి చివరికి ‘ఆర్ఎక్స్-100’ నిర్మాత అశోక్ రెడ్డి పేరును వెల్లడించారు. ప్రస్తుతానికి దేవరాజ్, సాయిలను నిందితులు పోలీసులు ప్రకటించారు. అశోక్ రెడ్డి విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.
పరారీలో నిర్మాత అశోక్ రెడ్డి
ఈ కేసులో తన పేరు బయటికి వచ్చినప్పటి నుంచి అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయనకు నోటీసులు పంపినా ఎలాంటి స్పందనా లేదు. మూడ్రోజుల పాటు దేవరాజును, ఒక్కరోజంతా సాయిని విచారించిన పోలీసులు వారిద్దరి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. చివరికి ఇద్దర్నీ అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏ 1 గా సాయికృష్ణ,ఏ 2 గా దేవరాజ్ లపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం నుంచి అశోక్ రెడ్డి మొబైల్ పనిచేయట్లేదని డీసీపీ తెలిపారు. శ్రావణిని పెళ్లి చేసుకుంటామని ఈ ముగ్గురూ హామీ ఇచ్చినట్లు డీసీపీ చెబుతున్నారు. అశోక్ రెడ్డి పోలీసులకు దొరికితే ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కేసులో మూడో నిందితుడు అశోక్ రెడ్డే అవుతారు.
ఈ కేసు పూర్వాపరాలిలా…
నటి శ్రావణి 2012లో హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. 2015లో సాయికృష్ణారెడ్డి, 2017లో నిర్మాత అశోక్రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోల ద్వారా 2019లో దేవరాజు పరిచయమయ్యాడు. దేవరాజుకు శ్రావణి దగ్గరవడం సాయికి నచ్చలేదు. అతని కారణంగా ఆమె తనకు దూరమవుతోందని శ్రావణి కుటుంబ సభ్యులకు సాయి చెప్పాడు. దేవరాజుతో పరిచయం తర్వాత ఇంట్లో గొడవలు పెరిగాయి.
చివరికి శ్రావణిని తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఒకదశలో దేవరాజును పెళ్లి చేసుకుంటుందని శ్రావణిపై తల్లిదండ్రులు, సాయి కూడా దాడి చేశారు. గతంలో పంజాగుట్ట పీఎస్లో దేవరాజ్ పై శ్రావణి ఫిర్యాదు చేసింది. సాయి కూడా బెదిరింపులకు దిగే వాడని పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి ఈ ముగ్గురూ శ్రావణిని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడ్డారు. ఒక దశలో దేవరాజ్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఆమె కుటుంబ సభ్యులను మాత్రం ఈ కేసులో నిందితులుగా చేర్చలేదు.