Union Cabinet Expansion :
నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు మోడీ తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రి వర్గంలో కొత్తగా కొందరికి అవకాశం కల్పించడం, మరికొందరికి ఉద్వాసన పలకనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే 12 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ జాబితాలో సదానంద గౌడ, సంతోష్ కుమార్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్, హర్షవర్ధన్, థావర్ చంద్ గెహ్లాట్, దేవశ్రీ చౌదరి, సంజయ్ ఛౌత్రే, బాబుల్ సుప్రియో, రావ్ సాహెబ్, ధన్వే పాటిల్, రతన్ లాల్ కటారియా, అశ్వినీ చౌబే ఉన్నారు. మరికొందరు కీలక మంత్రులకు కూడా మోదీ ఉద్వాసన పలకనున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆయా నేతల్లో ఈ విషయంపై ఆందోళన నెలకొంది. అసలు ఎంతమంది మంత్రులను మోదీ తొలగిస్తారన్న విషయంపై స్పష్టత లేదు. అదే సమయంలో సమయం గడుస్తున్న కొద్దీ.. రాజీనామా చేస్తున్న మంత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది.
పరిశీలనలో ఉన్నపేర్లు ఇవే..
ఇదిలా ఉంటే.. కేబినెట్ లోకి కొత్తగా చేరే నేతలెంతమంది అన్న విషయంపై కూడా గంటగంటకూ సంఖ్య మారుతోంది. బుధవారం ఈ సంఖ్య 22 గా వినిపించగా… మధ్యాహ్నానికే 43కి చేరింది. అంతేకాకుండా మోదీ నుంచి పిలుపు వచ్చిందంటూ మోదీ నివాసానికి చేరుతున్న నేతల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా కొత్త మంత్రులుగా అవకాశం దక్కనున్న నేతలుగా తీరథ్ సింగ్ రావత్, అనుప్రియా పటేల్, జ్యోతిరాధిత్య సింథియా, వరుణ్ గాంధీ, పశుపతి పరాస్, సర్బానంద సోనోవాల్, సుశీల్ మోదీ, అజయ్ భట్, అజయ్ మిత్రి, మీనాక్షి లేఖి, జమ్యాంగ్ సెరింగ్, నారాయణ్ రాశే, భగవత్ కేవడ్, రీటా బహుగుణ, శోభ, పంకజ్ చౌదరి, కపిల్ పాటిల్, ప్రీతమ్ ముండే, రమేశ్ జినజినగి, నారాయణ సామిలతో పాటు తమిళనాడు నుంచి మిత్రపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
కొత్త శాఖ.. కిషన్ కు ప్రమోషన్
అయితే ఈ మంత్రి వర్గ విస్తరణలో ఓ కొత్త మంత్రి వర్గ శాఖకు చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను రూపొందించేందుకు కేంద్రం సహకార శాఖ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేయనుందట. ఈ శాఖ ద్వారా దేశంలోని ప్రతిఒక్కరూ బాధ్యతాయుత స్ఫూర్తితో పనిచేస్తారని కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డికి ఈ దఫా కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేస్తున్న సహకార శాఖకు ఆయననే మంత్రిగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కు కూడా ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు… మొత్తంగా ఆరుగురు సహాయ మంత్రులకు కేబినెట్ హోదా ఇచ్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
సామాజిక సమతూకం దిశగా..
ఇదిలా ఉంటే.. సెకండ్ టెర్మ్ లో తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న మోదీ.. తన నూతన జట్టును సామాజిక వర్గాల వారీగా సమ తూకంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ దఫా ఎస్సీ సామాజిక వర్గానికి 12 మంత్రి పదవులు కట్టబెట్టనున్న మోదీ.. వారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఇవ్వనున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి కూడా 8 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఈ దఫా 5 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ విస్తరణ తర్వాత మోదీ కేబినెట్ లోని మంత్రుల సగటు వయసు 58 ఏళ్లుగా ఉండనుంది. అంతేకాకుండా 50 ఏళ్లలోపు వారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మోదీ కొత్త జట్టులో 13 మంది లాయర్లతో పాటు ఆరుగురు డాక్టర్లు కూడా ఉండనున్నారు. నలుగురు మాజీ సీఎంలకు మంత్రి పదవులు దక్కనుండగా… 18 మంది మాజీ మంత్రులకు కూడా పదవులు ఇవ్వనున్నారు.
సాయంత్రం ప్రమాణం
మంత్ర వర్గ విస్తరణపై బుధవారం సాయంత్రం లోపు మరింత స్పష్టత రానుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న 43 మంది.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఖరారైన కొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. మోడీ కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఎంతమంది చోటు దక్కించుకుంటారు? ఎవరికి ఉద్వాసన ఉంటుందనే అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.











