అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల్లో.. గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల.. ఇంఛార్జ్లు, తాజా మాజీలు కొత్త సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ లిస్టులో వంగ గీత ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. 2024 వరకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత.. సిట్టింగ్ సీటు వదులుకొని.. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోటీ చేశారు. అక్కడ ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పాతుకుపోయారు. అక్కడ ఆయన బలం రోజు రోజుకీ పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పిఠాపురం నుంచి జెండా ఎత్తేయాలని వంగ గీత ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనిని.. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్కు మార్చారు. అక్కడా ఓడిపోవడంతో.. రేపల్లె నియోజకవర్గం ఇంచార్జ్గా పంపించారు. ఒక్క రజనినే కాదు.. గత ఎన్నికల్లో చాలా మంది సీట్లను జంబ్లింగ్ చేశారు. ఓటమి తర్వాత కూడా విడదల రజని విషయంలో ఈ జంబ్లింగ్ పద్దతిని కంటిన్యూ చేశారు. ఇప్పుడు సేమ్ ఫార్ములా ప్రకారం తనకూ కొత్త సీటు కేటాయించాలని వంగ గీత పార్టీ అధిష్టానానికి మొర పెట్టుకొన్నారట.
పిఠాపురం నుంచి వంగ గీత సైడ్ అవ్వాలని ట్రై చేస్తున్నా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు. పిఠాపురంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబును తప్పించి.. వంగ గీతను పవన్ కళ్యాణ్పై పోటీకి దించారు. ఈ నిర్ణయంతో ఫ్యాను పార్టీపై అలిగిన దొరబాబు.. వైసీపీ ఓటమి తర్వాత జండా మార్చేసి.. జనసేన పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు వైసీపీ కేడర్లో మెజారిటీ సభ్యులు జనసేనకు జంప్ అయ్యారు. ఆల్రెడీ కేడర్ను కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు అక్కడ మిగిలిన ఒక్క లీడర్ను వదులుకొనే పరిస్థితుల్లో లేదు.
తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వంగ గీత.. 2000 నుంచి 2006 వరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీగా కొనసాగారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆమె 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో.. ఆయనతో పాటు కాంగ్రెస్లో చేరారు. 2019లో వైసీపీకి జంప్ చేసిన వంగ గీత కాకినాడ ఎంపీగా గెలిచారు. ఇప్పటికే అన్ని పార్టీలకు తిరిగిన వంగ గీతకు కూటమిలో ప్రాధాన్యం దక్కడం కష్టమే. వైసీపీలోనూ ఆమెకు భవిష్యత్తు కనిపించడం లేదు











