సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హావా బాగా తగ్గింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలనే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అయ్యేలా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. కేవలం సామాన్య ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్నే విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ఈ మాధ్యమానికి రెండు పార్శాలు ఉన్నాయి. ఫేక్ పోస్టులతో బాటు తప్పుడు పనులకు సోషల్ మీడియాని సాధనంగా వాడటం ఆందోళనను కలిగిస్తోంది. దీనికి రుజువుగా బెంగళూరులో ఓ ఘటన చోటు చేసుకుంది. పుల్కేషినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ అఖండ శ్రీనివాస్ మూర్తి మేనల్లుడు నవీన్ ఫేస్బుక్లో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేయగా దాంతో వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే అండ చూసుకొని నవీన్ ఇలాంటి పోస్ట్ పెట్టారని బెంగళూరులోని కావల్ బైరాసంద్రలో ఉన్న ఎమ్మెల్యే ఇంటిపై కొందరు దాడి చేయడమే గాకుండా అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు.
ఆ నిప్పు ఎమ్మెల్యే ఇంటికి కూడా అంటుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. అయినా ఆందోళనలు సద్దుమణగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ముగ్గురు మరణించగా 60 మందికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు 110 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాం నమ్మకాలకు విరుద్ధంగా పోస్ట్ చేసిన నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతిని నెలకొల్పాలని ఆందోళన కారులను కోరుతూ ఎమ్మెల్యే ఓ వీడియోని విడుదల చేశారు. సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎంతటి పరిణామాలకు దారి తీస్తాయోనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నకిలీ వార్తలను ప్రచారం చేయడం ఆపండి. అసాంఘిక చర్యలను రెచ్చగొట్టే సాధనంగా సామాజిక మాధ్యమాలను వాడొద్దని కేటీఆర్ సూచించారు.