విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తీవ్ర స్థాయిలో ఉద్యమాలు కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంటును నూరు శాతం ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండో ఆలోచన చేయడం లేదు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ లోక్సభలో చేసిన ప్రకటన ఇందుకు బలం చేకూరుస్తోంది. ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూములు ప్రైవేటు పరం చేస్తామని…కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ లోక్సభలో ప్రకటించారు. అవసరమైన మేరకు భూములు ఉంచుకుంటామని, మిగిలిన భూములు, టౌన్ షిప్, రెండు రిజర్వాయర్లు అమ్మివేస్తామని మంత్రి ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంటులో రాష్ట్రానికి ఎలాంటి హక్కులు లేవని, అయినా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అనురాగ్ సింగ్ ఠాగూర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేశామని ఆయన గుర్తు చేశారు. లోక్సభలో కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ విషయం వెల్లడించారు.
ఏడు వేల ఎకరాలు గుర్తించాం..
విశాఖ స్టీల్ ప్లాంటులో 7వేల ఎకరాల మిగులు భూములు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. అవసరం మేరకు భూములు ఉంచి మిగతా వాటిని అమ్మివేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును నూరు శాతం ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని మంత్రి ప్రకటనతో తేలిపోయింది.