(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా నూరు శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని తాజాగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనతో కార్మిక సంఘాలు జాతీయ స్థాయి ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా నిరవధిక సమ్మెకు దిగుతామని యాజమాన్యానికి గురువారం నోటీసు ఇచ్చారు.
అత్యవసర సమావేశం..
భవిష్యత్ కార్యాచరణలో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులంతా అత్యవసరంగా సమావేశమై చేపట్టాల్సిన ఆందోళనలపై కార్యాచరణ రూపొందించారు. నాయకులు ప్రతిపాదించిన నిర్ణయాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గురువారం సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు తద్వారా ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 25 తర్వాత ఏ రోజైనా సమ్మెకు దిగాలని నిర్ణయించారు. నిర్వాసితులందరికీ పర్మినెంట్ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.11వ తేదీ అన్ని డిపార్టుమెంట్లలో యువ కార్మికులను కలుపుకొని పోరాట కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీ నిర్వహించిన అత్యవసర సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జె. డి. లక్ష్మీ నారాయణ తగిన సూచనలు చేశారు.
ఇదీ కార్యాచరణ..
11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అన్ని డిపార్టుమెంట్ల కార్మికులలో విస్తృతంగా ప్రచారం. 15,16,17 తేదీల్లో ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్కు లెటర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ కార్మిక సంఘాల నాయకులతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులను తరలించి ఉక్కు నగరం త్రిష్ణా గ్రౌండ్స్లొ కార్మిక ఘర్జన (భారీ బహిరంగ సభ) నిర్వహణ. 28వ తేదీ ఢిల్లీ రైతు నాయకులతో సభ జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘాలు తమ పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విథంగా విశాఖ ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా దేశ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయానికి వచ్చారు.
కేటీఆర్కు క్షీరాభిషేకం..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము కూడా పోరాడతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ఏపీలో ఆయనకు మంచి స్పందన వస్తోంది. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద కేటీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఆంధ్ర నాయకులు పొరుగు రాష్ట్రం మంత్రిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని నినాదాలు చేశారు.
Also Read : ఒడిశా పెత్తనం.. పథకం ప్రకారం విశాఖ ఉక్కు నిర్వీర్యం