విశాఖ ఉక్కు సంస్థలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ జరుగుతున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అవసరమైతే తమ పార్టీ అధినేత కేసీఆర్ అనుమతితో తాను కూడా విశాఖ వచ్చి ఆందోళనలో పాలుపంచుకుంటామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సంస్థలను, పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కులాంటి సంస్థలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేటు పరం చేస్తారన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఇక విశాఖ ఉక్కు కోసం పార్టీలన్నీ ఏకం అవుతున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా మద్దతు పలకడంపై విశాఖ ఉక్కు సంస్థ కార్మిక సంఘాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. విశాఖ ఉక్కు సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందని చెప్పవచ్చు.
రాజకీయవిషయానికి వస్తే..
ఇక్కడ పలు కోణాల్లో చర్చ నడుస్తోంది. ఆ అంశాలను పరిశీలిస్తే..
- తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతీయులకు సంబంధించిన ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఓటూ కీలకంగా మారిన తరుణంలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
- అందులో భాగంగానే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ కుమార్తె సురభి వాణి దేవికి ఓటేయాలంటూ పట్టభద్రులకు జనసేన పార్టీ శతఘ్ని టీం చేసిన ట్వీట్ ద్వారా కోరింది. మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఫొటోతోపాటు వాణిదేవి ఉన్న ఫొటోతోపాటు సందేశాన్ని కూడా ట్వీట్ చేసింది. ఇప్పటికే జనసేన ఏపీలో బీజేపీతో పొత్తులో ఉంది. విశాఖపట్నం ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేసే నిర్ణయం తీసుకున్న బీజేపీపై ఇప్పటివరకు గట్టిగా వ్యాఖ్యానించలేదు జనసేన పార్టీ. అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావుకు కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తూ జనసేన శతఘ్ని టీం ట్విట్ చేయడంపైన చర్చ నడుస్తోంది. ఏపీ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఈ వ్యూహాలు ఏమైనా తెరపైకి వచ్చాయా అనే సందేహాలూ వస్తున్నాయి. ఈ ట్వీట్ పై జనసేన పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆ ట్వీట్ అధికారికమా కాదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
- ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే షర్మిల తెలంగాణలోనే పార్టీ ఎందుకు పెడుతున్నారనే అంశంపై పలు రకాల చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. రానున్న కాలంలో ఏపీకి చెందిన తెలంగాణలో ఉన్న ఓటర్లు అటు షర్మిలవైపు లేకపోతే టీఆర్ఎస్ వైపు ఉండేలా కార్యాచరణ ఉంటుందనే చర్చ నడుస్తోంది.
- 22మంది ఎంపీలు, 151మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ ఒక్కతాటిపై వచ్చి.. పోరాటం చేయవచ్చు. అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. లేఖలు, పాదయాత్రలు, స్థానికంగా ఆందోళనలకే పరిమితం అవుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాజకీయ కార్యాచరణ కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అఖిలపక్షంతో కలసివస్తామని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం, ఆ అఖిలపక్షంలో ఏయే పార్టీలున్నాయనే అంశంపై క్లారిటీ రాకపోవడంపై ఇప్పటికే చర్చ నడుస్తున్న వేళ.. తమకు మద్దతుగా టీఆర్ఎస్ను కూడా ఆ జాబితాలో చేర్చుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
- కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో మరికొన్ని కీలక అంశాలున్నాయి. ఎక్కడో విశాఖలో జరుగుతున్న ఉద్యమం కదా..మనకెందుకులే అనుకుంటే.. కేంద్రం తరువాతి కాలంలో మిగతా ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా ప్రైవేటుపరం చేస్తుంది. రేపు బీహెచ్ఈఎల్ అంటారు..ఎల్లుండి సింగరేణి అంటారు.. ఇలా పలు రాష్ట్రాల్లోని కంపెనీలను ప్రైవేటు పరం చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు పరస్పరం పోరాటానికి మద్దతుగా రావాలి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్వాగతించదగినవే. అయితే అదే సందర్భంలో..రైతులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్న నిజాం షుగర్స్ లిమిటెడ్ అంశంపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.
మొత్తం మీద రాజకీయ కారణాలను, విశ్లేషణలను పక్కన బెడితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలకడం స్వాగతించదగిన పరిణామమే. అయితే పార్టీలన్నీ హిడెన్ అజెండాలు లేకుండా ఏకతాటిపై వచ్చి కేవలం విశాఖ ఉక్కు సంస్థను కాపాడుకునేందుకు పోరాటం చేసినప్పుడే లక్ష్యసాధనకు మార్గం సుగమం అవుతుందనే చర్చ నడుస్తోంది.
Must Read ;- విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడతాం.. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ప్రకటన











