గంటా శ్రీనివాసరావు.. పవర్ ఎక్కడుంటే అక్కడే ఆయన ఉంటారని పేరు. టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా 1999నుంచి ఇప్పటివరకు పలు పార్టీలు మారి.. ఎప్పుడూ అధికార పక్షంలో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారని పేరున్న వ్యక్తి. రాష్ట్ర విభజన తరుణంలో టీడీపీలో చేరిన ఆయన ఇటీవలి వరకు టీడీపీలోనే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందగా వైజాగ్ (ఉత్తర) నియోజవర్గంనుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు తరువాత కాలంలో సైలెంట్ అయ్యారు. వైసీపీలో చేరడం ఖాయమనుకున్న సమయంలో ఆయన ప్రత్యర్థి వర్గం వ్యతిరేకించడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనకు వైసీపీనుంచి దారులు మూసుకుపోలేదు. కేవలం స్థానికంగా ఉన్న ప్రత్యర్థులే అడ్డుగా ఉండడంతో అదనుచూసి రంగంలోకి దిగారు గంటా.
షరతులతో లేఖ..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే పేరుతో షరతులో కూడిన రాజీనామా లేఖను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ పంపారు. వాస్తవానికి సరైన ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపితేనే..నిజమైన రాజీనామా లేఖగా భావిస్తారు. అంటే సదరు రాజీనామా లేఖలో కారణాలు పేర్కొనకూడదు. కేవలం రాజీనామా చేస్తున్నట్లు మాత్రమే రాయాలనే సంప్రదాయం కొనసాగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప.. షరతులతో కూడిన రాజీనామాను, లేదా వేరే ఫార్మాట్ లో ఉన్న రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశం ఉండదు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు లేఖ విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటు పరం అయ్యాక తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇకరాజీనామా అనేది ఆయన రాజకీయ వ్యక్తిగత విషయమే అయినా సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అంత ధైర్యంగా రాజీనామా చేసే ఉద్దేశం ఉంటే.. సరైన ఫార్మాట్ లో పంపవచ్చు లేదా ప్రైవేటు పరమైనప్పుడు రాజీనామా చేయవచ్చు. ఈ లోగా రాజీనామా చేయడం ఎందుకనే చర్చ నడుస్తోంది.

ఇక్కడే వైజాగ్ తన అడ్డగా మార్చుకున్న అధికార పార్టీకి చెందిన ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ధిల్లీ స్థాయి నేత రాత్రికి రాత్రి గేమ్ ప్లాన్ చేసినట్టు ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. ముందునుంచి గంటా శ్రీనివాసరావు ను వైసీపీలోకి రప్పించేందుకు సదరు నేత ఆసక్తిగానే ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న గంటా ప్రత్యర్థివర్గం వ్యతిరేకిస్తుంది. గంటాను సదరు నేత వైసీపీలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారన్న అనుమానంతోనే గంటా ప్రత్యర్థివర్గం సదరు ధిల్లీ స్థాయి నేతపైనా విమర్శలు చేసింది. దీంతో కొన్నాళ్లపాటు గంటా సైలెంట్ కావాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీనుంచి కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఇష్యూలో దొరికిందే అవకాశంగా రంగంలోకి దూకారు. ఓ రాజీనామా లేఖ రాసేసి వెంటనే ప్రెస్ తో మాట్లాడడం, వైజాగ్ రుణం తీర్చుకునేందుకు తానుఎలాంటి త్యాగమైన చేస్తానని ప్రకటించడం జరిగిపోయాయి. పనిలో పనిగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ఈ విషయంలో గంటాపై విమర్శలూ చేశారు. ఆ విమర్శల వెనుక వైసీపీనే ఉందని, ఎవరికీ అనుమానం రాకుండా ఈ తతంగం నడిపించినట్టు చర్చ నడుస్తోంది. తన వంతు వంతు బాధ్యతగా రాజీనామాతో ప్రారంభించి రాజకీయేతర జేఏసీ ఏర్పాటుచేస్తామని కూడా చెప్పాడం గమనార్హం.
వైసీపీపై సానుకూల ప్రకటన..
అయితే 24గంటలు కూడా గడవకముందే వైసీపీపై తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు గంటా. సొంత ఇనుప ఖనిజ గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలని, స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తాను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు జగన్ స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించాలని కోరారు. ఇలా పలు సలహాలు ఇచ్చారు.
వైసీపీకి రక్షణగా..
ఈ రాజీనామాతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు గంటా వ్యవహరించారని చెప్పవచ్చు. గతంలో విజయవాడ పక్కనే భవానీ ఐలాండ్ లీజు వ్యవహారంలో గంటాకు సంబంధించిన కంపెనీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనూ ఆయన తన వ్యతిరేకరులనూ తనవైపు తిప్పుకునే వ్యూహం అమలుచేసినట్టు అక్కడి నాయకులు చెబుతుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. రాజీనామా చేస్తే పేరు రావడంతో పాటు టీడీపీని టార్గెట్ చేయడం, వైసీపీలో లైన్ క్లియర్ కావడం ఏకకాలంలో జరిగాయనే చర్చ నడుస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనాలని, తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వమే నష్టాన్ని భరించేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. స్థానికంగా వైసీపీని, పరోక్షంగా కేంద్రాన్ని టీడీపీ విమర్శిస్తుండగా వైసీపీ మాత్రం తమపై వ్యతిరేకత రాకుండా చూడడం, పాజిటీవ్ క్రెడిట్ టీడీపీకి వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే గంటా రాజీనామాలోనూ సదరు వైసీపీ నేత గమ్ ప్లాన్ చేసినట్టు చర్చ నడుస్తోంది.
Also Read: గ్రామస్థులను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు











