బతికుంటే బలుసాకైనా తినొచ్చు అనేవారు కొందరైతే.. పుస్తెలమ్మి అయినా పులస చేప కూర తినాలనేవారు మరికొందరు.
ఈ సామెతల మాట ఎలా ఉన్నా ఈ రోజు ఆ పులస మాట వింటే… ఒకవేళ దాన్ని కొంటే మనం ఫినిష్ అనే వారు కూడా ఎక్కువయ్యారు. దాని ధర కొండెక్కేసరికి అలా అనాల్సి వస్తోంది మరి. ఇంతకీ ఎంత అంటారా… రెండు చేపల ఖరీదు అక్షరాలా 31 వేలు. ఒక్కో చేప రెండు కిలోల బరువుంది.
ఆ డబ్బుతో చేప తినేబదులు బంగారమే కొంటే పోలా అనిపిస్తోంది కదూ. ‘ఆహా ఏమి రుచి… తినరా మైమరచి’ అని పులసల గురించి మనం అనుకోడానికి వీలు లేదు. ఆ స్థోమతు ఉన్నవారు మాత్రమే పులసలు కొనే రోజులొచ్చాయి. అసలే కరోనా… ఆపై ఆర్థిక మాంద్యం.. అయినా పులస కొనేందుకు మాత్రం ఎవరూ వెనుకాడటం లేదు. అందుకే పులసలకు ఈ రోజు ఇంత డిమాండు. డిమాండ్ పెరిగితే ఈ రేటు కూడా పెరిగిపోతుంది.
ఎక్కడిదీ పులస? ఏమా కథ?
పులస చేప పుట్టుక అంతా సముద్రంలోనే. సముద్రంలో ఉన్నంత వరకూ దాని పేరు ఇలస. ముఖ్యంగా గోదావరిలోనే పులస చేపలు ఎక్కువగా దొరుకుతాయి. సముద్రంలో పుట్టిన ఈ చేప గోదావరికి ఎదురు ఈదుకుంటూ వెళతుంది. అలా వెళ్లే క్రమంలో నీటి రాపిడికి దాని చర్మం మరింత తెల్లగా మారి వెండిలా మెరిసిపోతుంది. ఆ ఎదురీతలో దానిలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. అలా సముద్రపు నీటి నుంచి మంచి నీటిలోకి మారడం, ఆ మారే క్రమంలో ఎదురీదడంలాంటి కారణాల వల్ల దాని రుచి మరింత పెరిగిందంటారు. ఈ మధ్య కాలంలో పులస చేపలు దొరకడం కూడా మత్స్యకారులకు గగనమైంది. ధర బాగా పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. వలలో ఒక పులస చేప పడితే ఆ మత్స్యకారుడి పంట పండిందన్న మాటే. గోదావరిలో ఆ చేప ఎంత ఎదురీదితే దాని రుచి అంత పెరుగుతుందట.
ఇంతకీ ధర ఎంత పలుకుతోంది?
పులస చేపల ధరలు మూడు వేలకు తక్కువ ఉండటం లేదు. ఆ చేప క్వాలిటీని బట్టి ధర ఉంటుంది. గత ఏడాది
అంతర్వేది సమీపంలో ఆ పులస చేప కిలో 9వేలు పలికింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలో ఉన్న చించినాడ వంతెన వద్ద ఓ మత్స్యకారుడికి ఈ మంగళవారం నాడు రెండు కిలోల బరువున్న రెండు పులస చేపలు దొరికాయి. ఆ రెండు చేపలనూ రూ. 31 వేలకు అతను అమ్మాడు. పులసంటే ఇష్టపడే సఖినేటి పల్లి మండలం అప్పనరాముని లంక మాజీ సర్పంచ్ బర్రే శ్రీను వీటిని కొన్నారు. పులస చేప కూర వండటం కూడా ఓ కళే. అది వండటం అందరికీ రాదు. ఈ చేప దొరికే గోదావరి తీర ప్రాంతాల్లో ఈ చేపల కూర వండేవారికి కూడా మంచి డిమాండు ఉంది. అక్కడి స్థానికులే కాకుండా వివిధ పట్టణాల వారు కూడా ఆర్డరు చేసి పులస కూరను తెప్పించుకుంటూ ఉంటారు.
నాడు దొరగారు.. నేడు హీరోగారు..
పులస చేప కూర ఒకసారి తింటే ఆ జిహ్వచాపల్యం ఇక వదిలిపెడుతుందా. ఏకంగా వండిన కూరే ఇంటికి తెచ్చిపెడుతుంది. మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించిన ఇంజినీరు ఆర్థర్ కాటన్ దొరగారిని కూడా మన పులస ఇట్టే పడేసిందట. ఇక ఆయన ఆర్డర్ పడేస్తే చేపకూర ఆయన ఇంటికి చేరకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆయన మద్రాసులో నివాసముండేవారు. రాజు తలచుకుంటే చేపలకు కొదవాలేదు.. డబ్బులకూ కొదవా లేదు. దొరగారి ఇంటికి రైతులే కూర వండించి పంపించేవారట. ఆయనకు గోదావరి మీద అంత ప్రేమ పెరగడానికి మన పులసలు కూడా తోడ్పడ్డాయోయేమో మరి.
అంతేకాదండోయ్ ఈ పులస కూర మన మెగా హీరోల ఇంటికి కూడా చేరిపోతుంటుంది. ఆ హీరోల నెట్ వర్కే వేరు కదా. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు చేపల కూరంటే మహా ఇష్టపడతారు. వీరంతా ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో వివిధ పట్టణాల్లో స్థిరపడ్డారు. వీరి కోసం బస్సుల్లో ఈ చేపల కూర రెండు రాష్ట్రాలలోని వివిధ పట్టణాలకు చేరిపోతుంటుంది. ఈ చేపల కూర వండిన వెంటనే కాకుండా ఆ మరుసటి రోజు తింటే ఇంకా రుచిగా ఉంటుందట. ఆ పులసల కూరకు బెండకాయలు కూడా తోడైతే ఇక దాని రుచిని వర్ణించటానికి మాటలు కూడా చాలవంటారు. అందుకే మనలో చేవ ఉన్నంత కాలం ఈ పులస చేపల కూర తినాల్సిందేనేమో.