తెలుగుదేశం నాయకులు ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన.. ఏం పీకుతారు.. అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు.
రాష్ట్రంలో నివర్ తుఫాను నష్టంపై టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతుండగా, సీఎం జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులకు పై కంపార్డుమెంటు ఖాళీగా ఉందంటూ బుర్రను చూసిస్తూ చేసిన కామెంట్లతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు సహా అందరూ భైఠాయించారు.
ప్రతిపక్షనాయకుడు స్పీకర్ పోడియం ముందు భైఠాయించడం ద్వారా ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి నేడు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ వైసీసీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళన మరింత పెంచారు. ప్రతిపక్ష సభ్యులు సీట్లలో కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని కోరినా ఫలితం లేకుండా పోయింది.
కోవిడ్ కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి బదులిచ్చారు. కొద్ది రోజులపాటు తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంది కాబట్టే ఈ సమావేశాలు జరుపుతున్నామని సీఎం గుర్తుచేశారు. చంద్రబాబునాయుడు సమావేశాలను అడ్డుకునేందుకే స్పీకర్ పోడియం ముందు భైఠాయించారని సీఎం తప్పుపట్టారు. చంద్రబాబు కళ్లు పెద్దగా చేసి, రౌడీయిజం చేస్తున్నారని సీఎం తప్పుపట్టారు. ఏం పీకుతారు అని ప్రతిపక్ష సభ్యులు మాట్లాడటం సిగ్గుచేటని, చంద్రబాబుకు వయసుకు తగ్గ బుద్ధి లేదని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభకు చర్చ జరపడానికి వచ్చారా? పీకించుకునేందుకు వచ్చారా? అని సీఎం ప్రశ్నించారు.
స్పీకర్ పోడియం ముందు భైఠాయించిన ప్రతిపక్ష టీడీపీ సభ్యులను నేటి సమావేశాల నుంచి స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. దీంతో సభ్యులను మార్షల్స్ బయటకు పంపించివేశారు.