(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఎవరు చేశారో.. ఎందుకు చేశారో.. వెనక మతం ఉందా.. దొంగతనమా.. ఆకతాయితనమా.. కుట్రా..!? మొత్తానికి కారణం ఏదైనా గాని ఈ రోజున అగ్నిపర్వతం బద్దలైంది. పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారింది.రాములోరి సన్నిధిలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.. పార్టీల నేతలు.. జరిగిన ఘోరాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజానికి జరిగినది చిన్న విషయం కాదు.. రామతీర్ధం అనే కాదు.. రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. ఒకవైపు భక్తి రాజ్యం.. రామరాజ్యం స్థాపిస్తామనే నినాదంతో.. పాలన సాగిస్తూ పరాకాష్టగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తిరుగులేని అధికార శక్తిగా ఉన్న తరుణంలో ఇలాంటివి జరగడం శోచనీయం.. వీటిపై బిజెపి కూడా అవసరమైన స్థాయిలో స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామతీర్థం ఘటన పరిస్థితిని మరీ సునిశితంగా మార్చింది.
హిందూ క్షేత్రాల్లో వరుస ఘోరాలు
అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. హిందూ క్షేత్రాల్లో వరుసగా ఘోరాలు జరుగుతుండడం మాత్రమే గాక ఆయా ప్రదేశాల్లో అన్యమతస్థుల పెత్తనం పెరిగిపోతుండటం దారుణమైన విషయంగా పేర్కొనవచ్చు. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు రామతీర్థం ఉదంతం.. దేవాదాయ శాఖ మంత్రి ఇంచార్జిగా ఉన్న జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన జరగడం మరీ చర్చనీయాంశం అయింది. జరుగుతున్నవి ఆపలేకపోగా జరిగిన తర్వాత కూడా దర్యాప్తులో తగిన రీతిలో వ్యవహరించక పోవడం చింతించవలసిన విషయం.. బిజెపి కూడా సంఘటనలు
జరిగినప్పుడు హడావుడి చెయ్యడం తప్పిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెద్దల దృష్టికి విషయం తీసుకువెళ్ళి అక్కడ నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెయ్యడం లేదు. వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల నివారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆశలు పెట్టుకోవడం లేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు చెప్పుకుంటున్న బిజెపి వైపు చూస్తున్నారు.
జుగుప్సాకరం
ఈరోజున రామతీర్థం లో జరిగిన సంఘటనలను అంతా హైడ్రామా గా పేర్కొన వచ్చు గాని నిజానికి అది అత్యంత జుగుప్సాకర ఉదంతం.. ఒక సున్నితమైన అంశంపై..ప్రజలంతా ఒక్కటై పోరాడాల్సిన పరిస్దితి.. అయితే జరుగుతున్నది ఏంటి..
రాజకీయ పార్టీలు.. వాటిని నడుపుతున్న శక్తులు జరిగిన సంఘటనను ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకునే నీచ ప్రయత్నాలు చేస్తూ రాములోరికి రాజకీయ శాలువా కప్పి అపవిత్రం చేస్తున్నారు. ఇది హేయం.. జుగుప్సాకరం.. ఇప్పటికే ఆలస్యం అయింది. ఒక పక్క వరస దుర్ఘటనలు.. మరోపక్క అన్యమతస్థుల పెత్తనం.. పరిస్దితి ఎంతవరకు వెళ్తుందా అని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.. పరిష్కరించ వలసిన ప్రభుత్వం వినోదం చూస్తూ ఉంది. పైగా కొన్ని వేళ్ళు పెద్దతలకాయ వైపే చూపుతున్న సంకట స్థితి.
ఏంటో.. ఎటు పోతుందో ఈ రాష్ట్రం..బాగు చేసేది.. చెయ్య గలిగేది ఎవ్వరో..???
Also Read: వీర్రాజు మాటల్లో కుట్రకోణం దాగి ఉందా?