వీర్రాజుగారు వీర హామీలిచ్చేస్తున్నారు. ‘అమరావతే రాజధాని.. మోదీ ప్రతినిధిగా చెబుతున్నా’ అంటూ ఒట్టేసి చెబుతున్నా లెవెల్లో చెప్పేస్తున్నారు. అటు జగన్ చేసే మూడు రాజధానుల వ్యవహారాలకు బ్రేక్ వేయగలిగే స్థితిలో ఉన్నా.. పట్టించుకోరు. కీలకమైన విషయాల్లో కిక్కురుమనరు. ఎంతసేపు టీడీపీ మీద ఏడవటం.. వైసీపీ కూడా అంటూ కాస్త కలిపి మాట్లాడటం తప్ప ఏనాడూ వైసీపీ మీద డైరెక్ట్ గా అటాక్ చేసింది లేదు. జీవీఎల్ నరసింహారావు క్రైస్తవ మత ప్రచారం అంటూ విమర్శలు చేస్తారు.. సునీల్ దియోధర్ హిందూ దేవాలయాలకు రక్షణ లేదంటారు.. అన్నీ అంటారు.. కాని సోమువీర్రాజుగారు అవేమీ మాట్లాడరు. ఆయన ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ మాట్లాడతారు. ఇప్పుడు కూడా వైసీపీ హయాంలో జరుగుతుందంటాడు.. దానికి ఏం చేస్తాడో చెప్పడాయన.
అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీకి కాకుండా తమకే దక్కాలన్న ప్లాన్ మాత్రమే బిజెపికి ఉన్నట్లు కనపడుతోంది. అటు పవన్ ను కూడా చూపించుకుని.. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆకర్షించగలిగితే.. అప్పుడు టీడీపీ, వీరికి మధ్య చీలిపోతే.. జగన్ బెనిఫిట్ పొందొచ్చు అనేదే స్ట్రాటజీగా కనపడుతోంది. అటు జగన్కు అన్ని విధాలా సహకరిస్తూ.. ఇటు ఏదో పోరాడుతున్నట్లు బిల్డప్పులు ఇస్తూ.. కేవలం ప్రతిపక్ష పాత్రను హైజాక్ చేయాలని చూడటమే తప్ప.. కాస్త కూడా చిత్తశుద్ధి లేదనడంలో సందేహమే లేదు.
Must Read ;- మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
జైలుకెళ్లొచ్చిన ఐఎఎస్ ఆఫీసర్ కోసం .. జైలుకెళ్లొచ్చిన ముఖ్యమంత్రి రికమెండేషన్ చేస్తే.. వీరు ఆమోదించేస్తారు. హైకోర్టును సైతం ధిక్కరిస్తున్న చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగించమంటే ఆమోదిస్తారు. అసలు హైకోర్టు ఇస్తున్న ఆదేశాల మీద గాని.. హైకోర్టుపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద గానీ ఈ సోమువీర్రాజు మాట్లాడిన పాపాన పోలేదు. వాటి జోలికే పోలేదు.
అలాంటి సోమువీర్రాజు 5 వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేస్తానంటున్నాడు. అమరావతే రాజధాని అని ఖండితంగా చెబుతున్నాడు. ఇదీ ఒకందుకు మంచిదే.. కాస్త ఆ ప్రాంత ప్రజల్లో ఆశలైనా చిగురిస్తాయి. కాని వీరిలాగే చెబుతుంటారు.. ఆ జగన్ అలాగే వైజాగ్ వెళుతూ ఉంటాడు. ఇంకో రెండు నెలల ఆగితే వైజాగ్ యాక్షన్ ప్లాన్ ఏంటో క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడా జగన్ ప్రయత్నాలకు అడ్డు రాని సోము వీర్రాజు.. జనానికి ఏదో మేలు చేస్తున్నట్లు ఫోజు పెడుతున్నాడు. అలాంటి వీర్రాజు వైజాగ్ ప్రయత్నాలను మాత్రం అడ్డుకోడు. తాము అధికారానికొస్తే అమరావతే రాజధాని అంటాడు కామెడీగా.
జనంలో మాత్రం కమలనాథులేదో కరుణిస్తారనే నమ్మకం మాత్రం పోయింది. అమరావతికి అనుకూలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న మాలను కూడా అనుమానంగా, అదొక రకం కుట్రేమో అన్నట్టుగా చూస్తున్నారు. రాష్ట్రాన్ని, అమరావతిని ఉద్ధరించే సంగతి తర్వాత.. ముందు తమను ప్రజలు అనుమానించే దుస్థితినుంచి బీజేపీ బయటకు వస్తే చాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!