ఏడేడు జన్మలు కాదు.. ఏడు క్షణాలు కూడా మాకు ఈ భార్యలతో మేము వేగలేం అంటూ భార్యాబాధితులు కొందరు వట సావిత్రీ పూర్ణిమ వ్రతం నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాస్తవానికి ఈ వ్రతాన్ని హిందూ మహిళలు ఆచారిస్తూ ఉంటారు.ఈ జన్మలో తమకు భర్తగా లభించిన వ్యక్తే ఏడేడు జన్మలకు తన భర్తగా రావాలని కోరుతూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. సావిత్రి తన భర్త అయిన సత్యవంతుడిని యమధర్మరాజు నుంచి రక్షించుకుంది. ఈ నేపథ్యంలో తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ.
అయితే, దానికి భిన్నంగా పౌర్ణమి రోజును పురస్కరించుకుని మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్లో భార్యాబాధిత వ్యక్తి ఆశ్రమంలో భార్యాబాధితులు సమావేశమయ్యారు.సమావేశం అనంతరం వారందరూ కలిసి వట సావిత్రి వ్రతాన్ని నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ పీపల్ చెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు.
కొందరు మహిళలకు పీపల్ చెట్టును పూజించే అర్హత లేదని భార్యాబాధిత సంఘం సభ్యులు పేర్కొన్నారు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని..పురుషుల సాధికారతకు కూడా చట్టాలు అవసరమన్న వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.