నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 50 రోజులుగా 3 లక్షల మంది రైతులు ఢిల్లీ వీధుల్లో చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. నూతన చట్టాలపై స్టే విధించారు. ఈ చట్టాలపై అధ్యయనం చేసి రైతులకు, కేంద్రానికి మధ్య సయోధ్య చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కమిటీలో ఉన్న వారంతా కేంద్రం తీసుకు వచ్చిన నూతన చట్టాలను బలపరిచేవారే కావడంతో రైతు సంఘాల నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నూతన చట్టాలు రద్దు చేయమని రైతులు కోరుతుంటే, ఆ చట్టాలను గౌరవించే వారు రైతులకు ఎలా న్యాయం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
రైతులకు ఎలా న్యాయం జరుగుతుంది?
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నలుగురు సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. అశోక్ గులాటి, ప్రమోద్ జోషి, భూపిందర్ సింగ్ మన్, అనిల్ ఘన్వత్ లతో కూడిన కమిటీలో రైతు సంఘాల నేత మన్ మాత్రమే ఉన్నారు. మిగతా వారిలో ఇద్దరు ఆర్థికరంగ నిపుణులు, మరొకరు మహారాష్ట్రలో రైతుల పక్షాన పోరాడిన వ్యక్తి. రైతుల సమస్యల గురించి వీరికి తెలియదని కాదు. అయితే ఆర్థికరంగ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారు కావడంతో వారు మొదటి నుంచీ నూతన చట్టాలను బలపరుస్తున్నారు. అంటే రైతుల పక్షాన వారు ఎలా నిలబడతారనే ప్రశ్న తలెత్తుతోంది. రైతుల భయాలను, వారి డిమాండ్లను ఎంతవరకు సానుకూల దృక్పథంతో వినిపించుకుంటారు? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
కమిటీలోనే భిన్నాభిప్రాయాలు వస్తాయా?
కేంద్ర ఏర్పాటు చేసిన కమిటీలో ఇద్దరు ఆర్థిక వేత్తలు పక్కాగా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు మద్దతు పలికేవారే. వారు చట్టాల రద్దుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. అందులో ఒకరు చట్టాలకు రూపకల్పన చేసిన వారిలో ఒకరని తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తులను కమిటీలో నియమించి నూతన చట్టాల్లో కేవలం ఏవో కొన్ని సవరణలు చేసి రైతు సంఘాలను, రైతులను మభ్యపెట్టే చర్యలకు దిగుతోందనే అనుమానాలు వస్తున్నాయి. రైతులు, రైతు సంఘాలు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కమిటీ మాత్రం చట్టాలపై చర్చించి రైతు సంఘాలు సూచించిన సవరణలు చేయమని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. అది కూడా కేంద్రానికి అనుకూలంగా ఉంటేనే.
మద్దతుధర చెల్లించే విధానం నుంచి కేంద్రం బయట పడాలని భావిస్తోంది. ఇప్పటికి మద్దతుధర గ్యారంటీగా ఇచ్చేందుకు చట్టంలో పొందుపరిచేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. మద్దతుధర చెల్లించే విధానం నుంచి కేంద్రం తప్పుకుంటే వ్యవసాయరంగం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలయాపనకేనా ఈ కమిటీ..!
నూతన చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. కేవలం ఈ చట్టాలపై అభ్యంతరాలను మాత్రమే చెప్పాలని రైతు సంఘాలను కేంద్ర మంత్రులు చర్చల్లో కోరారు. కానీ రైతు సంఘాల నేతలు చట్టాలు రద్దు చేయాలని పట్టుపట్టారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. ఇప్పుడు కమిటీ వేయడం ద్వారా కొత్తగా సాధించేది ఏముంది కాలయాపన తప్ప. వీరిలో రైతుల పక్షాన ఇద్దరు వాదిస్తే, మరో ఇద్దరు ఆర్థిక వేత్తలు కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకే మద్దతు పలుకుతారు. ఇక చట్టాల రద్దు ఎలా సాధ్యం అవుతుంది. రైతు సంఘాలు వ్యక్తం చేసే అనుమానాలు, మద్దతు ధరకు ఎవరు హామీ ఇస్తారు. ఈ కమిటీ ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని భావించడం భ్రమే అవుతుందని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
‘మద్దతు ధర విషయాన్ని చట్టంలో భాగం చేస్తాం’ అనే పదం చెప్పకుండా.. ‘మద్దతు ధరకు రాతపూర్వక హామీ’ అని కేంద్రప్రభుత్వం నాటకీయమైన డైలాగులు వల్లె వేస్తోంది. నిజానికి రాతపూర్వక హామీ ఎప్పుడు ఎలా రూపుమారిపోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి కేంద్రప్రభుత్వపు నాటకాలు తాళలేకనే.. రైతులు ఏకంగా చట్టాల రద్దు అనే ఒకే ఒక డిమాండ్ తో ముందుకు వస్తున్నారు. అందుకే ఇంత కాలంగా కేంద్రం- రైతుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. మరి ఇప్పుడున్న రూపంలో ఈ కమిటీతో ఆ ప్రతిష్టంభన తొలగుతుందనే నమ్మకం కలగడం లేదు.